
● జిల్లాలో మార్కెట్ యార్డుల టార్గెట్ రూ.24.47 కోట్లు
జమ్మికుంట(హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ విధానంలో మార్పు తీసుకువచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించడంతో మార్కెట్ యార్డుల ఆదాయం గణనీయంగా పెరిగింది. రైతులు ఆధునిక పద్ధతులతో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలైన మార్కెట్ యార్డుల్లో క్రయ విక్రయాలు అధికంగా సాగుతున్నాయి. దీంతో పన్ను వసూళ్లతో మార్కెటింగ్ శాఖ ఆదాయం లక్ష్యానికి మించి సమకూరుతోంది.
మార్కెట్ కమిటీల ఆదాయం లక్ష్యం
● జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.24.47 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా, రూ.25.23 కోట్ల ఆదాయం సమకూరింది.
● ప్రభుత్వ రంగ సంస్థలైన పీఏసీఎస్లు, ఐకేపీలు, మార్ఫెడ్ ద్వారా 90 శాతం వ్యవసాయ ఉత్పత్తులు వరిధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు చేస్తున్నాయి. ఆయా మార్కెట్ల పరిధిలో అధిక మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరగడంతో మార్కెట్ శాఖకు లక్ష్యానికి మంచి ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
● అలాగే వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వాలు జీఎస్టీ తొలగించడంతో వ్యాపారుల అక్రమ దందాకు తెరపడింది. నామమాత్రపు టాక్స్ చెల్లింపులతో మార్కెట్లకు పన్ను రూపంలో ఆదాయం సమకూరుతోంది.
● వరంగల్ రీజియన్లో 110 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల టార్గెట్ రూ.10.32 కోట్లు కాగా రూ.14.45 కోట్లు, జగిత్యాల లక్ష్యం రూ.15.99 కోట్లు కాగా రూ.21.19 కోట్ల ఆదాయం సమకూరింది.
● కరీంనగర్ జిల్లా మార్కెట్ కమిటీల లక్ష్యం రూ.24.47 కోట్లు కాగా రూ.25.23 కోట్లు సాధించినా గతం కంటే తగ్గింది. వరంగల్ రీజియన్లో సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి.
జమ్మికుంట మార్కెట్ కార్యాలయం
జిల్లాలోని మార్కెట్ల వారీగా 2024–25 వార్షిక లక్ష్యం, సమకూరిన ఆదాయం(రూ.కోట్లలో)
మార్కెట్ యార్డు లక్ష్యం వచ్చిన
ఆదాయం
కరీంనగర్ 4.31 5.18
జమ్మికుంట 8.8 8.51
చొప్పదండి 2.30 2.30
హుజూరాబాద్ 2.87 3.35
గంగాధర 1.40 1.14
మానకొండూర్ 2.65 2.51
గోపాల్రావుపేట 2.15 1.94
సైదాపూర్ 70 లక్షలు 62.74 లక్షలు
ఆదాయం పెంచేందుకు కృషి
వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలతో మార్కెట్ కమిటీలకు ఆదాయం సమకూరేందుకు చర్యలు చేపడుతాం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తాం.
– ఎండీ షాబోద్దిన్,
జిల్లా మార్కెటింగ్ అధికారి
మార్కెట్ నిబంధనలతో..
మార్కెట్ పన్ను వసూళ్లలో నిబంధనలు సరళీకృతం కావడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పెరిగింది. చెక్పోస్టుల ద్వారా నిఘా ఏర్పాటు చేశాం. క్రయ విక్రయాల నమోదు, తద్వారా పన్ను చెల్లింపు క్రమంగా జరుగుతుంది. దీంతో మార్కెట్కు అధిక ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం.
– ఆర్. మల్లేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి,
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్

● జిల్లాలో మార్కెట్ యార్డుల టార్గెట్ రూ.24.47 కోట్లు

● జిల్లాలో మార్కెట్ యార్డుల టార్గెట్ రూ.24.47 కోట్లు