
కుక్కల దాడిలో దూడలకు గాయాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి శివారులోని పందిరి కొట్టంలో ఉంచిన రెండు గేదె దూడలపై శనివారం కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. స్థానికులు గమనించి వాటిని చికిత్స నిమిత్తం పశువుల ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా మండలంలోని కరడ్పల్లి, తాడ్వాయి, నందివాడ శివారులో పశువుల పాకలో ఉంచిన మేకలు, గొర్రెల పిల్లలు, లేగదూడలపై దాడిచేశాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాలలో ఉన్న కుక్కలను బయటకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రహదారి పరిశీలన
గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల కోసం నియమించిన యాక్సిడెంట్ రిజల్యూషన్ బృందం శనివారం గాంధారిలో రహదారిని పరిశీలించారు. పలువురు స్థానియ నాయకులతో మాట్లాడారు. ఈ బృందంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సహాయ మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఆర్అండ్బీ ఏఈ రవితేజ తదితరులున్నారు.
అలరించిన చిన్నారులు
మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేట ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల వేదిక నిర్మాణ దాత బూస శ్రీనివాస్, రూ. 50వేల విలువైన సామగ్రిని బహూకరించిన అర్కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ చెప్యాల గోవర్ధన్ రెడ్డి, పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన గ్రామస్తులతో పాటు ఇటీవల గ్రూప్– 1 పరీక్షలో విజయం సాధించిన భూస ఉదయ్ కిరణ్ ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు భవాని, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మక్బూల్, మాజీ ఎంపీటీసీ బూస శ్రీనివాస్, జయరామశర్మ, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఉన్నారు.

కుక్కల దాడిలో దూడలకు గాయాలు