
తాళ్లపూడిలో మృత శిశువు కలకలం
తాళ్లపూడి: మండల కేంద్రమైన తాళ్లపూడిలోని పుష్కరాల రేవులో మంగళవారం మృత శిశువు ఘటన కలకలం రేపింది. సుమారు 8 నెలలున్న గర్భస్థ మృత శిశువును చిన్న వస్త్రంలో చుట్టి అక్కడ పడవేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొవ్వూరు రూరల్ సీఐ బి.విజయబాబు, ఏఎస్సై చక్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ముధై తదితరులు సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. మృత శిశువును శవ పరీక్ష కోసం కొవ్వూరు ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అలాగే గ్రామంలోని ఆస్పత్రుల్లో ప్రసవాలకు సంబంధించిన వివరాలు సేకరించి, మృత శిశువు ఆచూకీ గుర్తించారు. గ్రామంలోని అశోక హాస్పిటల్కు రెండు రోజుల క్రితం గోపాలపురం మండలం ప్రగడపల్లికి చెందిన రాసపోతుల శ్రీనివాసు, దేవీ స్వప్న అనే దంపతులు వచ్చారు. దేవీ స్వప్నకు నెలలు నిండడంతో డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు జరిపారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెందడంతో ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆ బిడ్డను తామే ఖననం చేసుకుంటామని చెప్పడంతో శ్రీనివాసుకు అప్పగించారు. కానీ మృతశిశువును ఎక్కడ ఖననం చేయాలో తెలియక పుష్కరాలరేవు వద్ద వదిలేసి వెళ్లిపోయాడు.