
ఓపెన్కాస్ట్ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2 గనిని సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్నజాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్కాస్టులో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాలన్నారు. జీ–5 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. అధిక ప్రమాణాలతో బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. జీ–11 గ్రేడ్ బొగ్గును రామగుండం ప్రాంతానికి రవాణా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, పీఓ శ్యాంసుందర్, రక్షణ అధికారి నజీర్ పాల్గొన్నారు.
కాటారం: అమలుకు నోచుకోని హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల జాతీయ అద్యక్షుడు, బీజేపీ నాయకుడు గోమాస శ్రీనివాస్ ఆరోపించారు. కాటారం మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మంత్రి శ్రీధర్బాబు మంథని ప్రాంత అభివృద్ధిని మరిచిపోయారని విమర్శించారు. శ్రీనివాస్ వెంట బీజేపీ నాయకులు చల్ల నారాయణరెడ్డి, దుర్గం తిరుపతి, తదితరులు ఉన్నారు.
ఘనంగా ఫ్యామిలీ డే వేడుకలు
భూపాలపల్లి అర్బన్: సద్దుల బతుకమ్మ పండగను పురస్కరించుకొని ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఫ్యామిలీ డే వేడుకలను ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలోని సుభాష్ కాలనీ సింగరేణి ఫంక్షన్హాల్లో సేవా సమితి మహిళలతో నిర్వహించిన ఈ ఫ్యామిలీ డే బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిలుగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. మహిళలు, సేవా సభ్యులు రంగురంగుల బతుకమ్మలు అలంకరించుకొని వచ్చి ఆటపాటలతో ఆడి పాడారు. ఫ్యామిలీ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన సేవా సభ్యులకు బహుమతులు అందజేశారు. ఉత్తమంగా బతుకమ్మలను అలంకరించిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు రమేష్, మధుకర్రెడ్డి, సీఎంఓఐఏ ప్రతినిధి నజీర్, సేవా కార్యదర్శి రుబీన, సేవా సభ్యులు పాల్గొన్నారు.
లొంగిపోయిన
మావోయిస్టులకు రివార్డులు
ములుగు: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఇటీవల ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ సరెండర్ పాలసీలో భాగంగా తక్షణ సహాయంగా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికీ రూ.25 వేల చొప్పున వచ్చిన నగదు రివార్డును శనివారం ఎస్పీ తన కార్యాలయంలో వారికి అందజేశారు. గత మే నెలలో లొంగిపోయిన మడవి మంగ్లీ, మడకం కమలేష్, మడకం భీమేలకు నగదు రివార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు డీడీ, వైద్య చికిత్స, పునరావాస సాయం అందుతుందన్నారు. లొంగిపోయిన వారు సమాజంలో స్థిరపడేందుకు అన్ని విధాలా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందన్నారు.

ఓపెన్కాస్ట్ పరిశీలన