కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నేడు(గురువారం) మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక బీఎల్ఎమ్ గార్డెన్స్లో కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్, మల్హర్ మండలాలకు సంబంధించిన 300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు. 4 మండలాలకు చెందిన లబ్ధిదారులకు 50 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 90 కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణమాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.
34 మంది క్రీడాకారులు కోల్ ఇండియాకు ఎంపిక
భూపాలపల్లి అర్బన్: గత రెండు రోజుల పాటు భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 34 మంది క్రీడాకారులను కోల్ ఇండియా పోటీలకు ఎంపిక చేసినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. మిస్టర్ సింగరేణిగా సుంకరి శ్రీనివాస్రెడ్డి, బెస్ట్ స్ట్రాంగ్మెన్గా రమేష్, బెస్ట్ స్ట్రాంగ్ ఉమెన్గా దువ్వ అనూష, బెస్ట్ లిఫ్టర్గా కోరం అనిల్కుమార్లు ఎంపికై నట్లు వెల్లడించారు.
యాప్ను వినియోగించుకోవాలి
భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగా టీజీఎన్పీడీసీఎల్ 20 ఫీచర్లతో రూపొందించిన యాప్ను వినియోగించుకోవాలని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్సూర్ నాయక్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్లో టీజీఎన్పీడీసీఎల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ సేవలను వినిగించుకోవాలని సూచించారు.
గాలివాన బీభత్సం
వాజేడు: మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన గాలివాన సుమారుగా గంట పాటు వచ్చింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రంలో సుమారుగా 2 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏఈ అర్షద్ అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది మండల కేంద్రంలో లైన్ల వెంట తిరిగి ఇన్స్లెటర్ పెయిల్ అయినట్లు గుర్తించారు. వెంటనే కొత్తది అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
క్రికెట్ టోర్నమెంట్కు రేవంత్ ఎంపిక
ఎస్ఎస్ తాడ్వాయి: మండలంలోని కాటాపూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి రేవంత్గౌడ్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో అండర్ –19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 27న ఉత్తరాఖండ్లో హరిద్వార్లో జరిగే టోర్న మెంట్లో పాల్గొననున్నట్లు కోచ్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా కాటాపూర్ గౌడ సంఘం అధ్వర్యంలో కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య, గీత కార్మికులు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ముజాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు కోడి సతీష్, నాయకులు మద్దూరి రాములు, రహమాన్లు రేవంత్గౌడ్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
పాతాళగంగ పైపెకి..
ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి– మేడారం మార్గంలోని రోడ్డుకు కొద్ది దూరంలో అడవిలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చేతి పంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. మేడారానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ చేతి పంపు ఉంది. మేడారానికి వచ్చిన భక్తులు అడవి ప్రాంతంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకునేందుకు చేతి పంపు నీటితో అవసరాలను తీర్చుకుంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుడడంతో భూగర్భజలాలు పెరిగి చేతి పంపు నుంచి పాతాళగంగ వ్యవసాయ బోరు మోటారు పోసినట్లుగా ఉబికి వస్తుడడంతో మేడారానికి వచ్చిన భక్తులు, దారిగుండా వెళ్లే వాహనాదారులు అక్కడ కొద్ది సేపు వాహనాలను నిలిపి చూసి వెళ్తున్నారు.