
సమస్యలు తీరేదెన్నడో..?
● ఇబ్బందులు పడుతున్న రేషన్ డీలర్లు
● హామీల అమలులో పాలకుల జాప్యం
● గౌరవ వేతనం డిమాండ్ బుట్టదాఖలు
● నెలవారీ కమీషన్లూ అందట్లేదు..
భూపాలపల్లి అర్బన్: రేషన్ డీలర్లు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. పాలకులకు ఏళ్ల తరబడి మొరపెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేది ఏమీ లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డిమాండ్లు తీరుస్తామనే హామీలు డీలర్లను ఊరిస్తూ వచ్చాయి. ఏ ఒక్క సమస్యా తీరలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ డీలర్లకు అనేక హామీలు గుప్పించింది. రెండేళ్లు అవుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇలా ఎన్నో సమస్యలను పాలకులకు ఎప్పటికప్పుడు విన్నవిస్తున్నా, కనీసం చర్చలు కూడా జరపడం లేదనే ఆవేదన డీలర్లను వేధిస్తోంది. ప్రజాపాలనలో తమ కష్టాలు తీరుతాయనే నమ్మకం డీలర్లలో సన్నగిల్లుతోంది.
ఆరు నెలలుగా అందని కమీషన్..
రేషన్ డీలర్లకు కమీషన్ డబ్బులు కూడా ప్రతినెల క్రమంగా అందడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా ఆరు నెలలకు సంబంధించిన కమీషన్లు ఇంకా జమ కాలేదని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలో 247 మంది రేషన్ డీలర్లు ఉండగా, ఐదు నెలలకు ఒక్కొక్కరికి దాదాపు రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. నెలవారిగా డబ్బులు అందకపోవడంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘అమ్మ హస్తం’ పథకం అమలు చేశారు. బియ్యంతో పాటు చక్కెర, పప్పులు, నూనె ఇతర సరుకులు మొత్తంగా 9 నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేవారు. ఇది డీలర్లకు కాస్త లాభసాటిగానే ఉండేది. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. దీంతో కమీషన్లు గణనీయంగా తగ్గాయి. ఖర్చులు పెరగడం, కమీషన్లు తగ్గడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున అమ్మ హస్తం మాదిరిగా నిత్యావసరాల సరుకుల విక్రయంపై చర్యలు తీసుకోవాలని డీలర్లు వేడుకుంటున్నారు.
హామీలు నెరవేర్చాలి
నెలవారీ కమీషన్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలన్నింటినీ అమలు చేయాలి. డీలర్ల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి పరిష్కరించాలి.
– గడ్డం రాధాకృష్ణ
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
ఖర్చులు పోను మిగిలేదేమీ లేదు..
ఖర్చులన్నీ పోనూ డీలర్లకు చివరకు మిగిలేది ఏమీ లేదని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. దిగుమతి చార్జీలు సైతం తామే భరించడం వల్ల ఏమీ మిగలడం లేదంటున్నారు. ఒక్కోసారి తామే అదనంగా భరించాల్సిన దుస్థితి ఏర్పడుతుందనేది డీలర్ల వాదన. ఒక డీలర్ వంద క్వింటాళ్ల బియ్యం బస్తాలను దిగుమతి చేసుకుంటే రవాణా, డైవర్, కూలీ మొత్తంగా రూ.2 వేల వరకు భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. వంద క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయిస్తే క్వింటాలుకు రూ.140 చొప్పున మొత్తంగా రూ.14 వేలు కమీషన్ రూపంలో డీలర్కు లభిస్తుంది. ఈ ఆదాయంలో షాపు అద్దె, విద్యుత్ చార్జీలు, హమాలీ కూలీలు, ఇతరత్రా ఖర్చుల చెల్లింపులు జరిగితే ఏమీ మిగలడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో దిగుమతి చార్జీలు మరో భారంగా మారాయంటున్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించి దిగుమతి చార్జీలను భరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా డీలర్కు నెలకు రూ.2 వేలు మిగిలే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్లలో కాంటా సరిగ్గా ఉండక తూకంలో తక్కువ బియ్యం వస్తున్నాయని, బస్తాకు రెండు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ భారాన్ని కూడా తామే మోయాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. క్వింటాల్ బియ్యం బస్తా కచ్చితమైన తూకంతో డీలర్లకు సరఫరా చేయాలని, షాపు రెన్యువల్ శాశ్వత ప్రాతిపదికన జరగాలని, ప్రతి నెల ఒకటవ తేదీలోగా బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలివే..
డీలర్లకు గౌరవ వేతనం నెలకు రూ.5వేలు ఇస్తాం
క్వింటాకు కమీషన్ రూ.140నుంచి రూ.300కు పెంచుతాం
ఒక్కొక్కరికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేస్తాం
డీలర్ చనిపోతే అతని స్థానంలో వారసులకు అవకాశం కల్పిస్తాం
రేషన్ షాపు కరెంట్ బిల్లు, గది కిరాయిలు చెల్లిస్తాం

సమస్యలు తీరేదెన్నడో..?

సమస్యలు తీరేదెన్నడో..?