
రేపు హోమియో ఉచిత వైద్యశిబిరం
జనగామ రూరల్: ఈనెల 10వ తేదీన పట్టణంలోని ధర్మకంచలో ఉన్న యూపీహెచ్సీలో ఉదయం 10 గంటల నుంచి హోమియో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మమత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని రామంతాపూర్ ప్రభుత్వ హోమియో కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని చెప్పారు. మోకాళ్ల నొప్పులు, నడుమునొప్పి, మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందజేస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీసోమేశ్వరాలయం హుండీ ఆదాయం రూ.26,27,977
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.26,27,977 సమకూరినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. బుధవారం ఆలయ కల్యాణమండలంలో దేవాదాయ, ధర్మదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ ఎన్.నిఖిల్ పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు. ఈ ఏడాది మార్చి 21 నుంచి బుధవారం వరకు హుండీలో భక్తులు సమర్పించిన 201 రోజుల కానుకల ఆదాయాన్ని లెక్కించారు. ఆమెరికా కరెన్సీ నోట్లు 32(317 డాలర్లు), ఉగాండా 1 (5000 సీలింగ్స్), ఇంగ్లాండ్ 1 (5 ఫౌండ్స్), కొరియా ఓన్ 1(1000), యూరోపియన్ 1(10) యూరోలు వచ్చినట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, సిబ్బంది, శ్రీసోమేశ్వర, రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
లాయర్ కిషోర్దాస్పై కఠినచర్యలు తీసుకోవాలి
జనగామ రూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడిచేసిన లాయర్ కిషోర్దాస్పై కఠిన చర్యలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని నెహ్రూ పార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, మహిళలు, ఆదివాసులు, మేధావులు, ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దేశంలో ప్రధాన న్యాయమూర్తికి కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో సుంచు విజేందర్, పుత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్ , బోట్ల శ్రావణ్, కళ్యాణం లింగం, పాము శ్రీకాంత్, గడ్డం యాదగిరి, సౌందర్య, బైరగొని మల్లేశం తదితరులు పాల్గొన్నారు
ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రోద్బలంతోనే..
ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రోద్బలంతోనే చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి జరిగిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శేఖర్ ఆరోపించారు. బుధవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో తుటి దేవదానం, బొట్ల శ్రావణ్కుమార్, పొన్నగంటి చిరంజీవి, గండి నాగరాజు పాల్గొన్నారు.
పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నట్లు బుధవారం ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. భారత ప్రభుత్వంతో ఆమోదించబడిన ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హనుమకొండ బ్రాంచ్ ద్వారా ఈట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు కూడా అందజేస్తారని జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హనుమకొండ డీహెచ్ఎస్డీ ప్రమోద్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అధికారి డాక్టర్ ఎల్.జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ఎం రెహమాన్, ఫిజిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ వరలక్ష్మి, అధ్యాపకులు డాక్టర్ ఎ.సరిత, డాక్టర్ బి.సరిత, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ గిరి తదితరులు పాల్గొన్నారు.

రేపు హోమియో ఉచిత వైద్యశిబిరం