
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లెర్నింగ్
జనగామ: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంలో మరో కొత్త అడుగు పడనుంది. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంలో పరిపూర్ణులను చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ‘ఏ బుక్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశాని(పాఠ్య ప్రణాళిక తరగతులు)కి శ్రీకారం చుట్టబోతోంది. 6 నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటు న్న పిల్లలకు ఇది ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సంయుక్త భాగస్వామ్యంతో డిజిటల్ లెర్నింగ్ బోధన కొనసాగనుంది. ఈ పాఠ్యాంశాలను సమర్థవంతంగా బోధించేందుకు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో త్వరలో జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇక్కడి వెసులుబాటును చూసుకుని తేదీలను ప్రకటించనున్నారు.
కార్పోరేట్కు దీటుగా ప్రభుత్వ బడులు
జిల్లాలో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఇక నుంచి డిజిటల్గా బోధించనున్నారు. ప్రాథమికోన్నత–64, ఉన్నత పాఠశాలలు 103 ఉండగా, వీటి పరిధిలో సుమారు 12వేల పైచిలు విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, టీజీఎంఎస్, కేజీబీవీ, టీఆర్ఈఐఎస్ పాఠశాలలలో పనిచేస్తున్న గణితం, ఇంగ్లిష్, భౌతిక, సాంఘిక శాస్త్రం బోధించే యూపీఎస్, హైస్కూల్ ఉపాధ్యాయులు 800ల వరకు ఉండగా, వీరంతా శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుంది. శిక్షణలో కోడింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు ఉంటాయి.
సకల సౌకర్యాలతో
శిక్షణ కోసం ప్రతి జిల్లా లేదా డివిజన్ స్థాయిలో తగిన సదుపాయాలతో కూడిన సెంటర్లను ఎంపిక చేయాలని అందులో పేర్కొన్నారు. శిక్షణ సమయంలో టీచర్లకు కంప్యూటర్లతో కూడిన ప్రయోగశాలలు, అసౌకర్యం లేని ఇంటర్నెట్, ఆడియో విజువల్ పరికరాలు, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్, మైక్లు, నిరంతర విద్యుత్, బ్యాకప్ సదుపాయం ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న పాఠశాలలలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ల్యాప్టాప్లు, అర్డు వినో కిట్స్తో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో టీచర్లు వారికి కేటాయించిన సెంటర్కు ఉదయం 9 గంటలకు చేరుకోనుండగా, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో వారి అటెండెన్స్ నమోదు చేస్తారు. అలాగే శిక్షణ కాలానికి సంబంధించి సర్టిఫికెట్ ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి. అక్టోబర్ 19వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేసుకుని etdepttscert@gmail.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. బడ్జెట్ కేటాయింపులు డిజిటల్ లెర్నింగ్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సమయంలో ప్రభుత్వం టీఏ, డీఏ ఇతర అలవెన్స్లను ఇస్తుంది. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాధికారులు సంబంధిత డీఐఈటీ ప్రిన్సిపల్స్కు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించి, కలెక్టర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. డీఆర్పీలకు రోజు వారీగా రూ.400 గౌరవ వేతనంతో పాటు టీచర్లకు టీజీటీఏ నిబంధనల మేరకు భత్యాలను చెల్లించనున్నారు.
ఉపాధ్యాయుల శిక్షణ కోసం కసరత్తు
కోడింగ్, డేటాసైన్స్, ఏఐ..అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు
విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల పెంపే లక్ష్యం