
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
జనగామ రూరల్: రెండు విడతలుగా నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెనన్స్ హాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేశ్ కుమార్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో, సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లాలోని 12 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందన్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదన్నారు. జెడ్పీటీసీ 12 మండలాలలో 12 స్థానాలు కాగా, ఎంపీటీసీ 134 స్థానాలకు గాను 783 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అఖిలపక్ష పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి బి.భాస్కర్, బీఆర్ఎస్ నుంచి రావెల రవి, సీపీఎం జోగు ప్రకాశ్, బీఎస్పీ తాండ్ర అఖిల్, బీజేపీ నుంచి జగదీశ్, జడ్పీ డిప్యూటీ సీఈవో సరిత, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, ఎన్నికల నోడల్ అధికారులు విక్రమ్ కుమార్, చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రఘు, కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీకాంత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
మారనున్న స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసిందని, రానున్న రోజుల్లో ఘన్పూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఘన్పూర్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనం, టౌన్హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, జంక్షన్ అభివృద్ధి పనులు, రోడ్డు వెడల్పు తదితర పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం, తాగునీరు, సెంట్రల్ లైటింగ్ పనులను అంచనా వేసి టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెండు విడతలుగా
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా