
సమన్వయంతోనే పుష్కరాలు సక్సెస్
భూపాలపల్లి: అధికారులు, ప్రజల సమన్వయంతోనే సరస్వతీనది పుష్కరాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్లో కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన ‘సరస్వతి పుష్కరాలు ఎ డే ఆఫ్ థాంక్స్’ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే మార్గనిర్దేశంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ మూడు నెలలు కష్టపడ్డారన్నారు. పుష్కరాల విజయవంతంలో వారి పాత్ర కీలకమని, వారందరికీ అభినందనలు తెలిపారు. పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదన్నారు. కొందరు సరస్వతీనది పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న అంశాలను భూతద్దంలో చూపించి తమను బద్నాం చేసేందుకు యత్నించారన్నారు. త్వరలోనే కాళేశ్వరం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడుతామన్నారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవోపేతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పుష్కరాల విజయవంతానికి కృషి చేశారన్నారు. పుష్కరాలకు వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్నారు. అనంతరం పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పలు శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అటెండర్ నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు మూడు నెలలు శ్రమించారు
పుష్కరాలు విజయవంతం కావొద్దని కొందరు కుట్రలు పన్నారు
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు