
రంగస్థల నటుడు శ్యామలరావు కన్నుమూత
హన్మకొండ కల్చరల్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నాటక రంగంలో దర్శకుడిగా, నటుడిగా ఖ్యాతి గడించిన శతపతి శ్యామలరావు (66) కన్నుమూశారు. వరంగల్ రైల్వేగేట్ ఉర్సు కరీమాబాద్కు చెందిన శతపతి శ్యామలరావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేశారు. కిడ్నీ శరీరానికి సరికాకపోవడంతో అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏటా రంగలీలా మైదానంలో నిర్వహించే రావణవధ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. నరకాసురవధ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఆదివారం ప్రముఖ రంగస్థల కళాకారుడు జీవీ బాబు మరణించడం.. బుధవారం మరో రంగస్థల సీనియర్ కళాకారుడు శతపతి శ్యామలరావు మృతి చెందడంతో ఓరుగల్లు రంగస్థల కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల అధ్యక్షుడు ఆకుల సదానందం, ఐక్యవేదిక బాధ్యులు కాజీపేట తిరుమలయ్య, ఎన్ఎస్ఆర్ మూర్తి, సీనియర్ కళాకారుడు జేఎన్ శర్మ, జూలూరు నాగరాజు, సహృదయ సాహిత్య సాంస్కృతిక బాధ్యులు, తదితరులు సంతాపం తెలిపారు.