
కోతులు, కుక్కలను తరిమినోళ్లకే..
రోజుకు 20 మందికి కుక్క కాటు..
ఓటేస్తామంటున్న పల్లె ప్రజలు
● గ్రామాల్లో శునకాలు, వానరాల బెడద తీవ్రం ● నిత్యం పదుల సంఖ్యలో దాడి ఘటనలు ● పంటల చేలను నాశనం చేస్తున్న కోతులు
బూర్గంపాడు: సాధారణంగా ఎన్నికలు వస్తే రోడ్లు, డ్రెయినేజీలు, ఇళ్లు లేవని, పింఛన్లు రాలేదని పోటీ చేసే అభ్యర్థులను ఓటర్లు డిమాండ్ చేస్తుంటారు. అభ్యర్థులు కూడా వాటిపైనే హామీలిస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కోతులు, కుక్కల నివారణే ప్రధాన ఏజెండాగా మారనుంది. పాతికేళ్లుగా గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతోంది. అదేస్థాయిలో కుక్కలు కూడా పెరిగిపోయాయి. కోతులు, కుక్కల దాడుల్లో పలువురు గాయపడుతున్నారు. జనాలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థులకే ఓటేస్తామనే డిమాండ్ ఓటర్ల నుంచి వస్తోంది.
పంట చేలల్లోనూ కిష్కింధకాండ
రాష్ట్రంలో అటవీ ప్రాంతంగా పేరున్న జిల్లాలో పోడు సాగు ప్రభావంతో కోతులు గ్రామాల వైపు మళ్లాయి. పట్టణాల్లో కూడా కోతుల బెడద తీవ్రంగానే ఉంది. ఇళ్లను చిందరవందర చేయటంతోపాటు పిల్లలను, మహిళలను, వృద్ధులపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. చేతులలో ఏదైనా కవర్ కనిపిస్తే చాలు ఎగబడి దాడిచేసి లాక్కుపోతున్నాయి. ఇంటి పెరళ్లలో కూరగాయ, పూలమొక్కలు వేసుకునే పరిస్థితులు లేవు. జిల్లాలో రోజూ కనీసం నాలుగైదు చోట్ల కోతుల దాడులలో ప్రజలు గాయపడుతున్నారు. ఇక పంటచేలను కోతుల మందలు నాశనం చేస్తున్నాయి. పత్తి కాయలను కొరికి పడేస్తున్నాయి. వరికంకులను విరిచేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు కాపలా మనుషులను పెట్టుకోవాల్సివస్తోంది.
అభ్యర్థులు ఏమి చెబుతారో..
ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఓటర్లు మాత్రం ఈసారి స్థానిక ఎన్నికలలో కోతులు, కుక్కల నివారణ కోసం ఏమి చేస్తారని అఽభ్యర్థులను నిలదీసే పరిస్థితులున్నాయి. కొన్నిచోట్ల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు లిఖితపూర్వకంగా కోతులను, కుక్కలను తరిమేస్తామనే హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తుగా కోతులు, కుక్కలు తరిమించే చర్యలు చేపట్టిన వారిని ఏకగ్రీవంగా గెలిపిస్తామని ఓటర్లు చర్చించుకుంటున్నారు.
గ్రామాల్లో వీధి కుక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే రక్షణగా చేతిలో కర్ర తెచ్చకోవాల్సి వస్తోంది. పదేళ్లుగా కుక్కల నివారణ చర్యలు చేపట్టడంలేదు. దీంతో కుక్కల దాడిలో పలువురు గాయాలపాలవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజూ 20కుపైగా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. పలువురు రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇటీవల పినపాక మండలంలో ఓ వ్యక్తి కుక్కకాటుతో రేబిస్ సోకి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు, కోతుల నివారణ చర్యలు తీసుకోవాలని ఏళ్ల తరబడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు అక్కడక్కడా కోతులను పట్టించే కార్యక్రమాలు చేపట్టారు. అవి కూడా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు.

కోతులు, కుక్కలను తరిమినోళ్లకే..