
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అమ్మవారికి అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు.కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులకు అన్నదానం నిమిత్తం చర్లకు చెందిన హయ్యలగిరి వెంకటప్రసాద్ రూ.10,116 విరాళం అందజేశారని ఈఓ తెలిపారు.
ఎర్లీబర్డ్కు గడువు పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ముందస్తుగానే వంద శాతం ఆస్తిపన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ ఇచ్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎర్లీబర్డ్ స్కీం గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయమై ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో పాటు ఇతర మున్సిపాలిటీల కమిషనర్లకు ఫోన్ ద్వారా ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలకు ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, ఎర్లీబర్డ్ ద్వారా కేఎంసీకి ఏప్రిల్లో రూ.10.13 కోట్లు ఆదాయం సమకూరిందని వెల్లడించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య.. ఇందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు.
గురుకులాల ఆర్సీఓగా అరుణకుమారి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఖమ్మం రీజియన్ గిరిజన సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి(ఆర్సీఓ)గా అరుణకుమారి నియమితులయ్యారు. గతంలో ఆర్సీఓగా పనిచేసిన నాగార్జునరావును మేడ్చల్కు బదిలీ చేయగా, ఆ స్థానంలో దమ్మపేట మండలం అంకంపాలెం గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారిని నియమించారు. ఈ విషయాన్ని గురుకులాల పరిపాలాధికారి నరేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
సింగరేణి సూపర్బజార్ ఎండీగా నికోలస్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో పర్సనల్ జీఎంగా పనిచేసిన బి. నికోలస్ను సూపర్బజార్ ఎండీగా నియమిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ ఏజీఎంగా విధులు నిర్వర్తిస్తున్న జి.వి.కిరణ్కుమార్కు పదోన్నతి కల్పించి కార్పొరేట్ పర్సనల్ జీఎంగా నియమించింది. వీరితో పాటు మరో పర్సనల్ ఏజీఎం మురళీధర్రావును ఈఈ సెల్ విభాగాధిపతిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కమనీయం.. రామయ్య కల్యాణం

కమనీయం.. రామయ్య కల్యాణం