
పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
రాయచోటి అర్బన్: ఉద్యోగులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్న సీపీఎస్ను వెంటనే రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పథాన్, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.వెంకట జనార్దన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపీఎస్స్ రద్దుకోరుతూ శుక్రవారం ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ను వెంటనే రద్దుచేయాలన్నారు. పెండింగ్ డీఏ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కిరణ్, పూర్వపు అధ్యక్షుడు పాలేల రామాంజనేయులు మాట్లాడుతూ ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయనేతలు పెన్షన్ పొందుతున్నప్పుడు 30 ఏళ్లకు పైగా సర్వీసు చేసిన ఉద్యోగులు పెన్షన్ను పొందడంలో తప్పేమీ లేదన్నారు. వృద్ధాప్యంలో ఉద్యోగులకు భరోసాగా నిలిచేది పెన్షన్ మాత్రమే అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాతపద్దతిలో పెన్షన్ పొందుతూ ఉద్యోగులకు మాత్రమే సీపీఎస్ను అమలుపరచడం దారుణం అని అన్నారు. అనంతరం డిఆర్ఓ మధుసూదన్కు వినతిపత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమ ణారెడ్డి, ఏపిసిపిఎస్ఈఏ యూనియన్ నేతలు శ్రీనివాస్, గురుప్రసాద్తో పాటు పెద్దఎత్తున ఉద్యోగులు,నేతలు పాల్గొన్నారు.