కూలిన పాక నుంచి బయటకు తీసుకురావడంతో మంచంలో ఉన్న రంగమ్మ
అవసాన దశలో మాతృమూర్తి ఆక్రందన
పట్టించుకోని కొడుకు.. ఆగిపోయిన పింఛన్
శిథిల పాకలో రోగవేదనతో వృద్ధురాలు విలవిల
పెడన: ఇటు కన్నబిడ్డ పట్టించుకోక... అటు వస్తున్న పింఛను ఆగిపోవడంతో ఓ పండుటాకు విలవిల్లాడుతోంది. కృష్ణాజిల్లా పెడన మండలం నేలకొండపల్లిలో అందరినీ కంటతడిపెట్టించింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు లింగం రంగమ్మ(87). ఊరు పెడన మండలం చోడవరం. కొడుకు కుటుంబరావు పట్టించుకోవడం మానేయడంతో ఆమెను సోదరి కుమారుడు ఉండే నేలకొండపల్లిలోని ఓ పాకలో ఉంచారు. ఎండనకా.. వాననకా.. ఆ పాకలోనే కాలంవెళ్లదీస్తున్న ఆమెకు పింఛనే ఆధారం.. చంద్రబాబు సర్కారు వచ్చాక వేలిముద్రలు, ఐరిస్ పడడం లేదని ఆమెకు 2025 సెప్టెంబర్ నుంచి పింఛన్ నిలిపేశారు. ఎంపీడీఓ అథెండిఫికేషన్తో పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా.. ఆ పని చేయలేదు.
దీంతో అప్పటి వరకు పింఛన్ సొమ్ము తీసుకుని ఆమె బాగోగులు చూసిన సోదరి కొడుకూ పట్టించుకోవడం మానేశాడు. అన్నపానీయాలు లేక పాకలోనే అవస్థలు పడుతున్న ఆ మాతృమూర్తి దయనీయ స్థితిని చూసి చలించిపోయిన స్థానికులు మూడునెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయింది. దీంతో సోమవారం బందరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పెడన ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్ సిబ్బందిని పంపించి వృద్ధురాలి బాగోగులు రెండురోజులు చూడాలని ఆమె చెల్లెలి కొడుకుకు అప్పగించారు. ఆమె సొంత కుమారుడిని పిలిపించి మాట్లాడతామని, పింఛన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


