
సాగుకు అవకాశం కల్పించాలని ఆదివాసీల వినతి
చింతూరు: పోలవర పరిహారం పొంది స్థానికంగా లేని గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూముల్లో సాగుకు స్థానిక ఆదివాసీలకే అవకాశమివ్వాలని ఆదివాసీ గిరిజన సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎటపాక, వీఆర్పురం గిరిజన సంఘం నేతలు స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని భూములపై ఆదివాసీలకు సర్వహక్కులు ఉన్నాయన్నారు. పరిహారం పొందిన గిరిజనేతరుల భూములపై సమగ్ర విచారణ చేపట్టి వాటిని స్థానిక ఆదివాసీలకు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీసం సురేష్, కాక అర్జున్, రామారావు, రాజు, వీరమ్మ, బాబు పాల్గొన్నారు.