
ప్రభుత్వ కొలువు.. అక్రమాలకు పరుగు
భూకబ్జాలు, రియల్ఎస్టేట్లో ఆరితేరుతూ.. సెటిల్మెంట్ల దందాలో పలు శాఖల ఉద్యోగులు ఉద్యోగాల పేరిట పేదలకు టోకరా అక్రమార్కుల భరతం పడుతున్న పోలీసు శాఖ
ఆదిలాబాద్టౌన్: సర్కారు నౌకరి.. లక్షల్లో జీతం.. దర్జాగా విధులు నిర్వహిస్తూ పేదలకు సేవ చేయాల్సిన కొంత మంది ప్రభుత్వ అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమాలకు ఒడిగడుతున్నారు. అక్రమ దందాలు, సెటిల్మెంట్లలో వీరి పాత్ర ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల పోలీసులు నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే.. ప్రభుత్వ అధికారుల పాత్ర తేటతెల్లం కావడంతో పాటు ఆ శాఖలకు మచ్చ తెచ్చేలా కనిపిస్తోంది. జనం నుంచి వీరికి ఛీత్కారాలు తప్పట్లేదు.
అక్రమాలకు అడ్డా..
ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగాలంటే మున్సిపల్ నుంచి అసెస్మెంట్ తప్పనిసరి. భవన నిర్మాణాలు ఉంటేనే వాటిని జారీ చేయాలి. కానీ కొంత మంది మున్సి పల్ ఉద్యోగులు, అధికారులు కాసులకు కక్కుర్తిపడి దొడ్డిదారిన అసెస్మెంట్లు జారీ చేస్తున్నారు. వాటి సాయంతో తప్పుడు పత్రాలను సృష్టించి అక్రమార్కులు రిజిస్ట్రేషన్ శాఖలో తమ పని కానిచ్చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల ప్లాట్ల కబ్జాలే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ కోసం సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే వారి లింక్ డా క్యుమెంట్లు, భూమి అసైన్డ్, పట్టా ల్యాండ్, ప్రభుత్వ భూమినా వంటి వివరాలు పరిశీలించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే రిజిస్ట్రేష న్ చేయాలి. కానీ సంబంధిత అధికారులు కొంత మంది డాక్యుమెంట్ రైటర్ల సాయంతో అక్రమాలకు తెర లేపుతున్నారు. ఇది ఒకెత్తు అయితే.. మరోవైపు ఇదివరకే రిజిస్ట్రేషన్ అయి ఉన్నవాటికి డబుల్ రిజి స్ట్రేషన్ చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. త ద్వారా అర్హులైన వారికి అన్యాయం జరుగుతోంది.
నిబంధనలు తుంగలో తొక్కుతూ..
ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారం చేయరాదు. ప్లాట్లు, భూములు కొనుగోలు చేస్తే సంబంధిత శాఖ ఉన్నతాధికారికి సమాచారం అందించాలి. సొంత డబ్బుతో కొనుగోలు చేస్తున్నాడా.. బ్యాంక్ నుంచి రుణం పొందుతున్నాడా అనే విషయాలను తెలియజేయాలి. అయితే జిల్లాలో చాలా మంది ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులు రియల్ ఎస్టే ట్ దందాలో ఆరితేరి అక్రమంగా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఉద్యోగం చిన్నదేనైనా రూ.కోట్లకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూ దందాతో పాటు చిట్టీలు నడపడం, పత్తి వ్యాపారం, మద్యం దుకాణాల్లో వాటాలు, ఇసుక దందా, సెటిల్మెంట్లు వంటివి చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ కొలువు.. అక్రమాలకు పరుగు