
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
ఆదిలాబాద్టౌన్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘రైతుల ముగింట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఆయా గ్రామాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు పలు సలహాలు, సూచనలు అందించనున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఏవిధంగా సాధించాలనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. జిల్లాలోని 44 గ్రామాల్లో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు సూచనలు అందించనున్నారు.
రైతులను చైతన్యపర్చేందుకు..
రైతులను చైతన్యపర్చేందుకు ప్రభుత్వం రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనెల 5 నుంచి 13 వరకు రైతుల చెంతకు శాస్త్రవేత్తలు వెళ్లనున్నారు. తొమ్మిది బృందాలుగా గ్రామాల్లో పర్యటిస్తారు. సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, సస్యరక్షణ చర్యలు, ఏయే భూముల్లో ఏయే పంటలు వేయాలి తదితర విషయాలను రైతులకు తెలియజేస్తారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు. కాగా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఆరుగురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఐదుగురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల నుంచి ఏడుగురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయ కళాశాలకు సంబంధించి 14 గ్రామాల్లో, కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు 18 గ్రామాల్లో, వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు 12 గ్రామాల్లో పర్యటిస్తారు.
నేటి నుంచి ఈనెల 13 వరకు..
అన్నదాతలకు అవగాహన
నేడు పొన్నారిలో ప్రారంభం
ఈనెల 13 వరకు కార్యక్రమాలు
ఈనెల 5 నుంచి 13 వరకు రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రైతుల చెంతకు వెళ్లి అవగాహన కల్పిస్తాం. అధిక దిగుబడులు ఏవిధంగా సాధించాలి, రసాయనాల వాడకం తగ్గించడం, ఏయే పంటలు సాగు చేయాలి, వాటికి ఆశించే చీడపీడల గురించి తెలియజేస్తాం. సోమవారం పొన్నారి గ్రామంలో ప్రారంభిస్తున్నాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– రాజశేఖర్, కేవీకే శాస్త్రవేత్త