
ఉండిలో రాక్షస రారాజు పాలన
సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్
పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో ఈ ఆరు నెలల కాలంలో రాక్షస రారాజు పాలన సాగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. నియోజకవర్గంలో వందలాది పేదల ఇళ్లు తొలగించారని మండిపడ్డారు. ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్లో మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ కూలగొట్టిన పేదల ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ ఇకపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆటలు సాగనివ్వబోమని, ట్రిపుల్ ఆర్ అంటే రాక్షస రారాజు అని అర్థమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన పీ–4 ఉండి నియోజకవర్గంలో రివర్స్లో ఉందని విమర్శించారు. సంపన్నుల సహకారంతో పేదలను అభివృద్ధి చేయాలని చెబుతుంటే, ఇక్కడ మాత్రం పేదలను కొట్టి సంపన్నులకు ఆస్తులను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కల్చరల్ ప్రోగ్రాంలో వేసిన దుర్యోధన పాత్రని ఎమ్మెల్యే నియోజకవర్గంలో అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
భూములు పంచకుంటే భూ పోరాటానికి సిద్ధం
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో భూస్వాముల చేతుల్లో ఉన్న భూములను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, లేని పక్షంలో భూ పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. పేదల గుడిసెలు మాత్రమే అధికారులకు, ఎమ్మెల్యేకు కనిపించాయా? భూస్వాముల చేతుల్లో ఉన్న వందలాది ఎకరాలు కనబడవా? అని ప్రశ్నించారు. భూస్వామ్య భావజాలంతో రఘు రామకృష్ణరాజు అహంకార పాలన చేస్తున్నాడని, ఇందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఎం సీనియర్ నేత మంతెన సీతారాం, కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, దూసి కళ్యాణి, మామిడి శెట్టి రామాంజనేయులు, కె.క్రాంతి బాబు, ధనికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.