
న్యాయఫలాలు అందరికీ అందాలి
● మెరుగైన వసతులతోనే న్యాయసేవలు
● జిల్లాకేంద్రంలో రూ.81 కోట్లతో
న్యాయస్థానాల సముదాయం
నిర్మాణానికి శంకుస్థాపన
● వర్చువల్గా ప్రారంభించిన
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఆపరేష్కుమార్ సింగ్
వనపర్తిటౌన్: న్యాయసేవలు సామాన్యుల దరి చేరేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని వైద్యకళాశాల సమీపంలో రూ.81 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో కోర్టు సముదాయం నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి, జస్టిస్ అనిల్ జూకంటి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ ఫలాలు చేరువ చేసేందుకు తగిన చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై బలమైన విశ్వాసం ఉందని... దానిని పదిలపర్చడంలో న్యాయవాదులు ముందుండాలన్నారు. మెరుగైన వసతులతో కూడిన న్యాయస్థానాల ద్వారా అందరికీ న్యాయ ఫలాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ అనిల్కుమార్ జూకంటిి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం చేకూర్చడానికి మౌలిక వసతుల ఏర్పాటు అవసరమన్నారు. కోర్టు సముదాయ నిర్మాణంలో అందరి కృషి ఉందని.. జిల్లాలో లీగల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జస్టిస్ మాధవి మాట్లాడుతూ.. తాను ఉమ్మడి పాలమూరు జిల్లా ఆడబిడ్డనే అని చెబుతూ, వనపర్తిలో సంస్థానాధీశుల కాలం నుంచే న్యాయస్థానాలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయసేవలు అందించే వ్యవస్థ ఉందని గుర్తుచేశారు. కొత్త భవనాల నిర్మాణంలో వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కృషి ఉందన్నారు.

న్యాయఫలాలు అందరికీ అందాలి