
టెట్ టెన్షన్
ఉపాధ్యాయులకు
ఆరిలోవ: దశాబ్దాలుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2010 సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో, రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి.
విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు, 2010 కంటే ముందు వివిధ డీఎస్సీల ద్వారా ఉద్యోగాలు పొందిన వేలాది మంది కూడా టెట్ రాయాల్సి రావడంపై వారు ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీ కోసం చదివి ఉద్యోగం సాధించిన మేము ఇప్పుడు మళ్లీ అర్హత పరీక్ష రాయడమేమిటి? అంటూ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తీర్పు ప్రభావం విశాఖ ఉమ్మడి జిల్లాలో భారీగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ యాజమాన్యాలలో సుమారు 17,000 మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల్లో మరో 12,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ టీచర్లు కూడా ఈ తీర్పు ప్రకారం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇన్ సర్వీస్లో ఉన్నవారు టెట్లో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగానికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆగస్టు 31, 2027 లోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. పదోన్నతి కావాలనుకునేవారు కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి
ఈ కీలక సమయంలో రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం టెట్ అంశంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో సందిగ్ధత మరింత పెరిగింది. మరోవైపు, టెట్ పరీక్షపై వారంలో నోటిఫికేషన్ విడుదల కానుందనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాల సర్వీస్ ఉన్నవారికి పరీక్ష రాయడం, అర్హత సాధించడం తీవ్ర సమస్యగా మారింది. అందువల్ల, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత వ్యవహారంలో మినహాయింపు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
టెట్ పరీక్ష విధానం
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రాయాల్సిన టెట్ పరీక్ష వివరాలు:
పేపర్లు: ఎస్జీటీలు పేపర్–1, స్కూల్ అసిస్టెంట్లు పేపర్–2 రాయాల్సి ఉంటుంది.
మార్కులు: రెండున్నర గంటల (150 నిమిషాలు) సమయంలో 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఉత్తీర్ణత మార్కులు:
ఓసీ అభ్యర్థులు: 60 శాతం మార్కులు (90 మార్కులు).
బీసీ అభ్యర్థులు: 50 శాతం మార్కులు (75 మార్కులు).
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులు: 40 శాతం మార్కులు (60 మార్కులు).