
పూడిక తీత..
● కట్టమంచి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా పూడికతీత పనులు ● అడ్డగోలుగా చెరువు మట్టిని అమ్ముకున్న టీడీపీ నాయకులు ● చెరువు అక్రమాలపై ఆర్టీఐకి ఫిర్యాదు చేసిన స్థానికులు ● అనుమతులతోనే పనులు చేశామంటున్న కూటమి నేతలు ● తమ వద్ద అనుమతులే పొందలేదని తేల్చేసిన ఇరిగేషన్ అధికారులు ● బయటపడ్డ కూటమి నేతల బాగోతం
నిజాలు ఇవే
కూటమి నేతలు అంతా మాయ చేశారు. చిత్తూరు నగరానికే తలమానికమైన కట్టమంచి చెరువును కుళ్లబొచేశారు. పూడిక తీత పేరుతో నాలుగు నెలలపాటు ఇష్టారాజ్యంగా తవ్వేశారు. వందల ట్రిప్పుల మట్టిని ఇష్టారాజ్యంగా విక్రయించి జేబులు నింపుకున్నారు. అధికార మదంతో ఏ ఒక్కర్నీ అటువైపు రానీయకుండా అడ్డుకట్ట వేశారు. తీరా స్థానికులు ఆర్టీఐకి విన్నవించడంతో టీడీపీ నాయకుల బాగోతం బయటపడింది. అసలు ఇరిగేషన్ అనుమతులే లేవని.. నిబంధనలు అస్సలే పాటించలేదని సంబంధిత అధికారులు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఔరా..! అంటూ పలువురు కూటమి నేతల తీరును ఎండగడుతున్నారు.
కట్టమంచి చెరువులో అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్న దృశ్యం (ఫైల్).
సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఎంతో చరిత్ర కలిగిన కట్టమంచి చెరువును టీడీపీ నాయకులు గుల్లచేశారు. అధికారుల అనుమతులతో పూడికతీత పనులు చేపడుతున్నామంటూ యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పూనుకున్నారు. భారీ ప్రొక్లైనర్లు, జేసీబీలు పెట్టి కొన్ని నెలలపాటు కట్టమంచి చెరువులోని మట్టిని తవ్వి తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. అలాగే టీడీపీ ప్రజాప్రతినిధి, ఓ కార్పొరేటర్ వేసిన వెంచర్లకు మట్టిని అక్రమంగా తరలించారు. దీనిపై ఏ ఒక్కరూ నోరుమెదపకుండా జాగ్రత్తపడ్డారు. అధికారులు, స్థానికులు కొందరిని లంచాలతో మేనేజ్ చేసి తమ పనికానిచ్చేశారు.
ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్నారా?
కట్టమంచి చెరువులో కొన్ని నెలలపాటు జరిగిన అక్రమ మట్టి తవ్వకాలపై ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. చిత్తూరు నడిబొడ్డున ఉన్న చెరువులో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతుంటే అధికారులకు చీమకుట్టినట్టూ లేదు. కళ్లెదుటే మట్టి తరలిపోతున్నా పట్టించుకోలేదు. ఇటీవల వరుసగా ‘సాక్షి’లో కథనాలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. అంటే అధికార పార్టీకి అమ్ముడుపోయారా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లేదా లంచాల మత్తులో కళ్లుమూసుకుని కూర్చున్నారా..? అని నిలదీస్తున్నారు. ఇప్పుడు సాఫీగా మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడంపై రగిలిపోతున్నారు. అత్యవసరమయ్యి.. ఎవరైనా ఒక లోడ్డు మట్టి ఎత్తితే ఆగమేఘాల మీదొచ్చి అరెస్టులు చేయించే అధికారులు నెలల తరబడి కళ్లెదుటే మట్టి తరలుతున్నా ఎందుకు పట్టించుకోలేదని గళం ఇప్పుతున్నారు. మరి వీటికి సమాధానం ఎవరు చెబుతారో వేచి చూడాలి మరి..!
కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇరిగేషన్
అధికారులు వెల్లడించిన లిఖిత పూర్వకమైన సమాధానం
కట్టమంచి చెరువులో మట్టితవ్వకాలకు సంబంధించి చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టారు. అందులో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఇరిగేషన్శాఖ చిత్తూరు సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జయచంద్రబాబు లిఖిత పూర్వకంగా కొన్ని విషయాలు వెల్లడించారు. అందులో కొన్ని..!
కట్టమంచి చెరువు పై గత ఐదేళ్లుగా తమ శాఖ తరఫున ఎలాంటి తనిఖీల నివేదికలు లేవు.
గత రెండేళ్లుగా కట్టమంచి చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్ట లేదు.
కట్టమంచి చెరువుకు సంబంధించి ఇరిగేషన్శాఖ తరఫున మట్టి తవ్వకాలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
ఆక్రమణలను తొలగించే అధికారం రెవెన్యూ శాఖకు మాత్రమే ఉంది.
కట్టమంచి చెరువులో గత రెండేళ్లుగా ఎలాంటి ఆదాయం రాలేదు.
నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ ఎవ్వరికీ ఎలాంటి అనుమతులు, ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు.
కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలపై ఎలాంటి ఫిర్యాదులు అంద లేదు.

పూడిక తీత..

పూడిక తీత..

పూడిక తీత..