
రేపు కోల్కతా హైకోర్ట్ జడ్జి రాక
ప్రశాంతి నిలయం: కోల్కతా హైకోర్ట్ జడ్జి అరిజిత్ బెనర్జీ ఈ నెల 9న పుట్టపర్తికి రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ఆయన పుట్టపర్తికి వస్తారని డీపీఆర్ఓ తెలిపారు. పుట్టపర్తిలోని సాయిటవర్స్ హోటల్లో బస చేయనున్నట్లు తెలిపారు. పదో తేదీన ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారని వెల్లడించారు.
రాష్ట్ర స్థాయిపోటీలకు శిరివరం విద్యార్థినులు
లేపాక్షి: శిరివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఇద్దరు రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.మైత్రి 69 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, మరో విద్యార్థిని గౌతమి 58 కేజీల విభాగంలో మూడో స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు శ్రీనాథ్, ఫిజికల్ డైరెక్టర్ సంపత్కుమార్ మంగళవారం తెలిపారు. మంగళగిరిలో త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను మంగళవారం ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.
10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
ధర్మవరం అర్బన్: నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల పదో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులు మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.కోట్లలో బిల్లులు రావాలని, వాటిని చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని తెలిపారు. అందుకే శుక్రవారం నుంచి వైద్యసేవలు బంద్ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
డైట్ కళాశాలకు గ్రాంట్ విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: బుక్కపట్నంలోని డైట్ కళాశాలకు 2025–26 సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ విడుదల చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు పద్దుల కింద మొత్తం రూ.9. 90 లక్షలు విడుదల చేశామన్నారు. ఇందులో 50 శాతం వార్షిక గ్రాంట్ రూ. 7.50 లక్షలు, టెక్నాలజీ సపోర్ట్ కింద రూ. 2.40 లక్షలు ఉన్నాయన్నారు. నిబంధనలకు లోబడి ఖర్చు చేసి వివరాలను టీసీఎస్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
‘చైతన్య జ్యోతి’కి
సిల్వర్ జూబ్లీ శోభ
ప్రశాంతి నిలయం: విదేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే పర్యాటకులకు సత్యసాయి చరిత్రను కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది చైతన్య జ్యోతి మ్యూజియం. చైనీస్ నిర్మాణ రీతిలో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం సత్యసాయి 75వ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. ప్రస్తుతం సత్యసాయి శత జయంతి నాటికి 25 వసంతాలకు చేసుకుంది. ఈ సందర్భంగా చైతన్య జ్యోతి మ్యూజియాన్ని ఇటీవల పునరుద్ధరించారు. విద్యుత్ దీపపు కాంతులు, పెయింటింగ్స్తోపాటు సత్యసాయి శత జయంతి వైభవాన్ని చాటే పలు ఘట్టాలతో నిర్మాణాలు చేపట్టారు. మలేషియా భక్తులు పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. సత్యసాయి శత జయంతి మరో 47 రోజుల ఉండగా, చైతన్య జ్యోతి మ్యూజియం తన సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించుకుని.. జయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులను కనువిందు చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం మ్యూజియంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ సంధర్బంగా పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు.

రేపు కోల్కతా హైకోర్ట్ జడ్జి రాక