
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తిరుపతిరెడ్డి, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా అమలు పరచకపోవడం సరికాదన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో పేద విద్యార్థులకు 25శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్, బాలనర్సు, స్వామి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.