
సాగు సులభం.. ఆదాయం ఘనం
దీపావళికి వచ్చేది బోనసే..
రైతులు సాధారణంగా దసరా, దీపావళి పండుగలు ఫోకస్గా బంతి సాగుచేస్తారు. దసరా తరుణంలో ఒకసారి, దీపావళికి మరోసారి పూలు కోసి విక్రయించేలా ప్రణాళిక చేస్తారు. ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగ, శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వీటి కోసం ఇప్పటికే సగం పైగా పూల విక్రయం ముగిసింది. ధర కూడా ఆశించినట్లు ఉండటంతో ఈ సారి లాభాలు బాగున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఎకరానికి అన్ని ఖర్చులు పోగా ఇప్పటికే రూ. 2లక్షల మేర ఆదాయం సమకూరిందంటున్నారు. దీపావళి వరకు తోట నిలబడి పూల దిగుబడి ఆశాజనకంగా ఉంటే అది బోనసేనని చెబుతున్నారు.
తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు పంచే బంతి సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం, తక్కువ వ్యవధిలో దిగుబడి వస్తుండటంతో ఆసక్తి పెరుగుతున్నది. సిద్దిపేట జిల్లాలో దాదాపు 350 ఎకరాల్లో బంతి సాగవుతోంది. కొందరు రైతులు ప్రధాన పంటగా బంతిని సాగు చేస్తుంటే, ఇంకొందరు అంతర పంటగా సాగు చేస్తున్నారు
పండుగలు, పెళ్లిళ్ల సీజన్కు..
ఉత్సవాలు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాల తరుణంలో బంతిపూలకు బాగా డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వచ్చే పండుగలు, శుభకార్యాలకు కోత వచ్చేలా రైతులు ప్రణాళికగా బంతిని సాగు చేస్తారు. జిల్లాలోని ములుగు, వర్గల్, గజ్వేల్, జగదేవ్పూర్, మర్కూక్, రాయపోల్, దౌల్తాబాద్, సిద్దిపేట, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, కొండపాక, కుకునూరుపల్లి, చిన్నకోడూరు తదితర మండలాల్లో 250కి పైగా రైతులు సాగు చేస్తున్నారు.
బడా వ్యాపారులే కొనుగోలుదారులు
బంతికి ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం లేదు. హైదరాబాద్, కరీంనగర్, సూర్యాపేట, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల బడా వ్యాపారులు బంతి సాగు చేసిన రైతులను ఫోన్ ద్వారా సంప్రదిస్తారు. పూలను తోటల నుంచి హోల్సేల్గా కొనుగోలు చేస్తారు. జిల్లా నుంచి హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, బెంగళూరు, ముంబై తదితర పట్టణాలకు తరలిస్తూ పూల ద్వారా అదనపు ఆదాయం గడిస్తారు.
బంతి ఎకరానికి సగటున 7 టన్నుల దిగుబడి వస్తుంది. పత్తి మాదిరిగా తెగుళ్ల బెడద ఉండదు. తక్కువ వ్యవధిలో లాభాలు వస్తుండటంతో దాదాపు మూడు దశాబ్దాల నుంచి జిల్లా రైతాంగం ఇటు వైపు మొగ్గుతున్నారు. ఎకరం బంతి సాగుకు రూ.50వేల దాకా పెట్టుబడి అవుతుంది. ప్రస్తుత మార్కెట్ ధరలు పరిశీలిస్తే హోల్సేల్గా కిలో బంతి పూలు రూ. 50 నుంచి 80 దాకా, రిటేల్లో తోటల వద్ద, రోడ్డు పక్కన రూ.75 నుంచి 150 దాకా అటు ఇటుగా ధరలు పలుకుతున్నాయి. ఎకరం సాగు ద్వారా సగటున రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల దాకా ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు.
బంతిపూలతో మహిళా రైతు
సగటున 7 టన్నుల దిగుబడి

సాగు సులభం.. ఆదాయం ఘనం

సాగు సులభం.. ఆదాయం ఘనం

సాగు సులభం.. ఆదాయం ఘనం