షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Oct 4 2025 6:18 AM | Updated on Oct 4 2025 6:18 AM

షాట్‌

షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

రూ. 7లక్షల ఆస్తి నష్టం

సిద్దిపేటరూరల్‌: షాట్‌ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని పెద్దలింగారెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం దినకర్‌రెడ్డి రోజులాగే ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోని విద్యుత్‌ వైర్లు సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగి నిప్పంటుకుంది. దీంతో రూ.లక్ష డబ్బులు, బియ్యం కాలి బూడిదయ్యాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక, పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. రూ.7లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ పూజల హరికృష్ణ బాధితుడిని పరామర్శించారు. అధైర్యపడొద్దని.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తానని హమీ ఇచ్చారు.

ఇంటికి దారి ఇవ్వడం లేదని..

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): తన ఇంటికి వెళ్లేందుకు దారి మూసేశారని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన హవేళిఘణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడుపల్లి సుభాశ్‌ కొంత కాలంగా తనకు ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వడంలో పాలివారు పలుమార్లు ఇబ్బందులు పెట్టారు. ఈ విషయంపై మెదక్‌ డీఎస్పీ, సీఐ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని మనప్తాపంతో పురుగులు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మెదక్‌ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు.

ఎల్లమ్మ ఆలయంలో చోరీ

చేగుంట(తూప్రాన్‌): మండలంలోని పెద్దశివునూర్‌ ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి పూజ సామగ్రితో పాటు హుండీలోని నగదు, అమ్మవారి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయ తలుపులు తెరిచి ఉండటం గమనించిన స్థానికులు ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టినట్లు, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

ఆస్పత్రికి వెళ్లిన

మహిళ అదృశ్యం

చేగుంట(తూప్రాన్‌): మనమరాలిని చూసి వస్తానని హైదరాబాద్‌ వెళ్లిన మహిళ అదృశ్యమైంది. చేగుంటకు చెందిన కడమంచి గోపాల్‌ భార్య సత్తమ్మ హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో ఉన్న మనమరాలిని చూసేందుకు సెప్టెంబర్‌ 30న వెళ్లింది. అక్టోబర్‌ ఒకటిన ఆస్పత్రి నుంచి బయలుదేరిన సత్తమ్మ ఇంటికి చేరుకోలేదు. ఆమె జాడ కోసం బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. కేసు దర్యాప్తులో ఉంది.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

చేగుంట(తూప్రాన్‌): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ అనంతపురం జిల్లా కొత్తకోటకు చెందిన నాగార్జున, ఈశ్వరీ భార్యాభర్తలు. వీరు ఇబ్రహీంపూర్‌ పౌల్ట్రీలో సూపర్‌వైజర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో పరిశ్రమ ఆవరణలో వారు ఉంటున్న గదిలో ఈశ్వరీ (33) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయాన్ని పరిశ్రమ మేనేజర్‌ వీరేశ్‌ పోలీసులకు సమాచారం అందించారు. రామాయంపేట సీఐ వెంకట్‌రాజాగౌడ్‌, ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతురాలి మెడకు గాయాలు ఉండటంతో పోలీసులు మృతురాలి భర్త నాగార్జునను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరళించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

భర్త అదృశ్యంపై ఫిర్యాదు

పటాన్‌చెరు టౌన్‌: అరుణాచలం వెళ్తున్నానని భార్యకు ఫోన్‌ చేసిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని గౌతమ్‌నగర్‌ కాలనీకి చెందిన అనిల్‌ బాబు గత నెల 29వ తేదీన తన సోదరుడితో కలసి అరుణాచలం వెళ్తున్నానని భార్య అనురాధకు ఫోన్‌ చేసి తెలిపాడు. తిరిగి రాత్రి ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో అనురాధ భర్త కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.

షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం1
1/1

షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement