సిరిసిల్ల: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నేతకార్మికులు నేసిన ఇందిరా మహిళాశక్తి చీరలను పరిశీలించనున్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పాల్గొంటారు. మంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ తెలిపారు.
ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.హరిత ఆది వారం ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఉండబోదని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాజన్న సేవలో ఎస్పీ
వేములవాడ: రాజన్నను ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం అర్చకులు స్వామి వారి ప్రసాదాలు అందించారు.
ఘనంగా కాకా జయంతి
సిరిసిల్ల: బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం వెంకటస్వామి(కాకా) జీవితాంతం పోరాడారని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు రాగుల రాములు పేర్కొన్నారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ కౌన్సిలర్ రాగుల జగన్, బుచ్చిబాబు, రాకేశ్, పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్
ముస్తాబాద్(సిరిసిల్ల): పంచ పరివర్తన్ ద్వారా హిందువుల ఐక్యతకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని జిల్లా సంచాలకుడు నిరంజనాచారి అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముస్తాబాద్లో ఆదివారం పథ సంచలన్ నిర్వహించారు. జెడ్పీ స్కూల్ నుంచి పురవీధుల్లో నాలుగు మండలాల కార్యకర్తలు పథ సంచలన్ నిర్వహించారు.
అనంతరం నిరంజనాచారి మాట్లాడుతూ 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందన్నారు. ఖండ కార్యవాహ కరుణాకర్, జిల్లా సహ కార్యవాహ వుచ్చిడి పద్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మట్ట వెంకటేశ్వర్రెడ్డి, సంతోష్రెడ్డి, సత్తయ్య, రాంగోపాల్, రమేశ్రెడ్డి, రమేశ్, వొరగంటి తిరుపతి, దేవేందర్, వెంకట్రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.
మునీరుద్దీన్కు పురస్కారం
ఇల్లంతకుంట(మానకొండూర్): అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంటకు చెందిన ఎండీ మునీరుద్దీన్ జాతీయ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో అందజేశారు.

నేడు సిరిసిల్లకు మంత్రి సీతక్క