
వాహనాల పెండింగ్ ట్యాక్స్ చెల్లించాలి
● రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ ● జిల్లా ఇన్చార్జి రవాణా శాఖ అధికారి వంశీధర్
సిరిసిల్ల: జిల్లాలో సరుకులు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇన్చార్జి రవాణాశాఖ అధికారి జి.వంశీధర్ శనివారం తెలిపారు. ఆయా వాహనదారులు రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్నారని వివరించారు. సిరిసిల్ల డివిజన్కు సంబంధించి 2,787, వేములవాడ డివిజన్కు సంబంధించి 1,632 వాహనాల ట్యాక్స్ పెండింగ్లో ఉందని తెలిపారు. జిల్లాలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా 11,425 వాహనాలు తిరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇందులో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో 6,647, వేములవాడ డివిజన్లో 4,778 వాహనాలు ఉన్నట్లు రవాణాశాఖ రికార్డులు చెబుతున్నాయన్నారు. ట్యాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల యజమానులు ట్యాక్స్ చెల్లించి ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్లో పట్టుబడితే వాహనదారులకు అపరాధ రుసుంతో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.