
గోవిందయ్య జోలికి వెళ్తే ఊరుకోం
● మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, అమరావతి: గంగాధర నెల్లూరు అంబేడ్కర్ విగ్రహం కాలిపోయిన ఘటనలో ఫిర్యాదు చేసిన దళితుడైన గోవిందయ్యను విచారణ పేరుతో నిర్బంధించడాన్ని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆయన జోలికి వచ్చినా .. గోవిందయ్యపై కేసులు బనాయించిన చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సెగ్మెంట్ పరిధిలో వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి పంచాయతీ దేవళంపేట అనే గ్రామంలో తమ పార్టీకి సంబంధించిన గోవిందయ్య, 2023 సంవత్సరంలో 10 అడుగుల అంబేడ్కర్ విగ్రహం స్థాపించారు. సర్పంచిగా ఉండి అనేక మంచి పనులు చేసిన ఆయనకు టీడీపీ నాయకుడు సతీష్ నాయుడుతో రాజకీయపరమైన వైరం ఉంది. ఈ విగ్రహం పెట్టే రోజు కూడా సతీష్ నాయుడు అడ్డుకోబోయాడు. విగ్రహం పెట్టడానికి వీల్లేదని పెట్టనీకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. విగ్రహ స్థాపన రోజు నుంచి ఆ విగ్రహాన్ని ఏవిధంగా తొలగించేందుకు సతీష్ నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సొంత నియోజకవర్గం ఇది. స్థానిక ఎమ్మెల్యే థామస్ అండతోనే ఈ ఆరాచకాలు చేస్తున్నాడు. గురువారం అర్థరాత్రి అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చివేశారు. విగ్రహం పెట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ మూకలు ఏవిధంగా నైనా ఆ విగ్రహాన్ని తొలగించాలని కుట్రతో ఈ ఘటనకు పాల్పడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాబుకు మొదటి నుంచి దళిత వ్యతిరేక విధానం ఉంది. టీడీపీ అమలు చేసిన పథకాల వల్ల దళిత సమాజానికి ఎలాంటి మేలు జరగటం లేదు. విగ్రహం తగుల బెట్టించింది కాక గోవిందప్ప ఇంటిపై పోలీసులు దాడి చేసి, నీవే తగులబెట్టావ్ అని ఒప్పకో కేసులు లేకుండా చేస్తాం అంటున్నారు. సర్పంచ్ని అలా బెదిరిస్తే చూస్తూ ఊరుకోము. చంద్రబాబును గద్దెదింపే దాకా ఈ దళిత సమాజం నిద్రపోదు. సీసీ టీవీ పుటేజీ తీయండి. నిజనిర్ధారణ చేయండి. అసలైన నిందితుడిని పట్టుకోవాలని’’ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.