
అంబేడ్కర్ విగ్రహ దహనం హేయం
● వైఎస్సార్ సీపీ ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున
సంతనూతలపాడు: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఆమేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై నిత్యం దాష్టీకాలేనని, దీనిలో భాగంగానే చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన టీడీపీ నేత సతీష్ నాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల గ్రామ బహిష్కరణలు, అంబేడ్కర్ విగ్రహాలకు అపచారం నిత్య కృత్యమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. అంబేడ్కర్ భావజాలాలపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవం నిలబెట్టడానికి అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున విలువైన స్థలంలో రూ.450 కోట్లతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని చూసి తట్టుకోలేక స్మృతి వనంలో లైటింగ్ తీసివేయించారని ఆరోపించారు.
ఒంగోలు టౌన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోనే పేద ప్రజలకు వైద్యం లభిస్తుందని, వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడమంటే పేద ప్రజలకు వైద్యాన్ని తిరస్కరించడమేనని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యను, ప్రజారోగ్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే ఆలోచనలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరగదని, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను మానుకోవాలని కోరారు. జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యు.వెంకటరావు, జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీ సహా రాష్ట్రంలోని ఇతర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీ మార్కాపురం ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావు, ప్రముఖ వైద్యులు, వైద్యరంగ నిపుణులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జేవీవీ నాయకులు ఏవీ పుల్లారావు, కుర్రా రామారావు, సీహెచ్ జయప్రకాష్, డాక్టర్ దార్ల బుజ్జిబాబు, యు.భాస్కర్, డీఎల్ ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్టౌన్: అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని అరెస్టు చేయాలని ఐఎల్పీ అధ్యక్షుడు డీ సుందరరావు డిమాండ్ చేశారు. ఒంగోలు మంగమూరు డొంకలోని అంబేడ్కర్, పూలే, బుద్ధ విగ్రహాలకు ఆదివారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం దేవళంపేట గ్రామంలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో కే వరప్రసాద్, డీ సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ విగ్రహ దహనం హేయం

అంబేడ్కర్ విగ్రహ దహనం హేయం