
రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా మన్నం వెంకయ్య
టంగుటూరు: రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా మండలానికి చెందిన మన్నం వెంకయ్యను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మన్నం వెంకయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పదవి రావడానికి సహకరించిన పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఒంగోలు టౌన్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేయడానికి ఈకేవైసీ కచ్చితంగా చేసుకోవాలని డ్వామా పీడీ జోసఫ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ అమలులోకి వస్తుందని, ఈకేవైసీ పూర్తి చేయని శ్రామికులకు పని ఇచ్చే అవకాశం ఉండదన్నారు. నవంబర్ 7వ తేదీలోగా జిల్లాలోని ఉపాధి శ్రామికులు ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించారు.
ఒంగోలు వన్టౌన్: మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సాధికారత అధికారి నిర్మలా జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కాన్ఫరెన్సు హాలులో ఈ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని వాల్మీకి సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు.
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కనిష్ట, గరిష్ట ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం ప్రారంభం నుంచి గరిష్ట ధర కేజీ రూ.280 కి కొనుగోలు చేసి వేలం చివర దశకు వచ్చేసరికి కేజీ రూ.346 చేశారు. అనంతరం ఇదే రౌండ్లో రూ.316 కు గరిష్ట ధరను తీసుకొచ్చారు. ఒక్క రోజులోనే గరిష్ట ధర పది రూపాయలు పడిపోయింది. 12వ రౌండ్ వేలం ప్రారంభంలో గరిష్ట ధర పెంచుకుంటూ పోయిన వ్యాపారులు చివరి దశకు వచ్చేసరికి మళ్లీ తగ్గించుకుంటూ వస్తున్నారని రైతులు వాపోతున్నారు. అదేమని అడిగితే అప్పుడు అవసరం ఉంది ఇప్పుడు అవసరం లేదని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. నాణ్యమైన పొగాకును గతంలో తక్కువకు కొనుగోలు చేయడం వల్ల నష్టపోయామని, ఇప్పుడు కనిష్ట ధరలు కూడా తగ్గించుకుంటూ పోతూ కేజీ రూ.85కు తీసుకొచ్చారని రైతులు వాపోతున్నారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో పొగాకు కనిష్ట ధర కేజీ రూ.85 పలికిందని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని కట్టవారిపాలెం, నర్సింగోలు గ్రామాలకు చెందిన రైతులు 1162 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 1019 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 143 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ.316, సరాసరి ధర కేజీ రూ.233.33 గా నమోదైంది. వేలంలో 16 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: గ్రానైట్ రాయల్టీని పెంచి వసూలు బాధ్యతను ఏఎంఆర్ సంస్థకు అప్పగించడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలం సుబ్బారావు, యం.రమేష్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిపోయిన తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలు పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని వివరించారు. ఫ్యాక్టరీల రాయల్టీని రూ.27 వేల నుంచి రూ.35 వేలకు పెంచడంతో పాటుగా జీఎస్టీతో కలిపి రూ.40 వేలకు చేరిందని తెలిపారు. అంతేకాకుండా రాయల్టీ వసూళ్లను ఏఎంఆర్ కంపెనీకి అప్పగించిందని, పెంచిన రాయల్టీతో పాటు అనధికార వసూళ్లకు తెరలేపడం, పనికిరాని రాయికి కూడా రాయల్టీ చెల్లించాలని యజమానులపై ఒత్తిడి చేయడం వంటి చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా 800 ఫ్యాక్టరీలు మూతవేసి ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు. గ్రానైట్ పాలిషింగ్ అండ్ కటింగ్ ఫ్యాక్టరీల యజమానులు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ కార్యదర్శిగా మన్నం వెంకయ్య