
గ్రానైట్ అక్రమ తవ్వకాలు ఆపాలి
కారుమంచి కాలువను పునర్నిర్మించి రైతులకు మేలు చేయాలి జిల్లా దిశ కమిటీ సమావేశంలో కలెక్టర్, దిశా కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు
ఒంగోలు సబర్బన్: చీమకుర్తిలో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని, లేకుంటే అనేక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు కలెక్టర్ పీ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఒంగోలు ఎంపీ, జిల్లా దిశ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 18 గ్రామాలకు తాగునీరు, 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే కారుమంచి కాలువ దాని పక్కనున్న క్వారీలో పడిపోయి రైతులు, రైతు కూలీల జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని తెలిపారు. కారుమంచి కాలువను ఆనుకుని ఉన్న మధుకాన్ గ్రానైట్ క్వారీ వారు పరిధిని మించి తవ్వకాలు చేపట్టారని, ఇరిగేషన్ పరిధిలో ఉన్న ఎన్ఎస్పీ కాలువను కూడా అక్రమంగా తవ్వారని తెలిపారు. ఫలితంగా చీమకుర్తి పట్టణ దక్షిణపు గ్రామాల రైతులు, రైతు కూలీలు సాగునీరు అందకపోవడంతో పాటు తాగునీరు కూడా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చివరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సి వచ్చిందని కూడా గుర్తు చేశారు. డీఎంఎఫ్ గ్రాంట్ నుంచి 2.62 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ టెండర్ పిలవకపోవడంలో ఆంతర్యం ఏమిటని వేమా ప్రశ్నించారు. లైనింగ్ మార్చి ఉన్న ప్రాంతానికి దూరంగా లైనింగ్ వేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రైతుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండో విధానంలో పైపులైను ద్వారా కారుమంచి కాలువను పునరుద్ధరించాలనే ఆలోచన కూడా చేస్తున్నారని, ఇది రైతులకు ప్రయోజనకరం కాదని అన్నారు. రైతులకు నష్టం వాటిల్లే నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఉమ్మడి కార్యాచరణతో క్షేత్రస్థాయి నుంచి ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. స్పందించిన కలెక్టర్.. తక్షణమే ఈ విషయంపై విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలపై కమిటీ చైర్మన్ మాగుంట సమీక్షించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.