
మున్సిపాలిటీల్లో తాగునీటి అవసరాలు తీర్చాలి
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని ఒంగోలు నగర కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పి. రాజాబాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరెట్లోని తన ఛాంబర్లో బుధవారం జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు, పబ్లిక్ హెల్త్, జిల్లాలోనీ అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాల అమలు తీరును, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ డ్రై వేస్ట్ నిర్వహణపై మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పట్టిష్టంగా అమలయ్యేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలోకి ప్రవేశించే ప్రదేశాన్ని పూర్థి స్థాయిలో సుందరీకరణంగా అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. నగరంలో చేపట్టిన ప్రధాన కాలువల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రానున్న సంవత్సరాల్లో ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.100 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర రావు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంజయ్ కుమార్, అన్నీ మున్సిపాలిటీల కమిషనర్లు, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి
మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు