
విద్యుత్ ఉద్యోగుల నిరసన గళం
తమ న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా భారీ ర్యాలీ ఒంగోలులో కదం తొక్కిన వందల మంది విద్యుత్ ఉద్యోగులు అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేత
ఒంగోలు సబర్బన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా సోమవారం ఒంగోలు నగరంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అన్ని యూనియన్లకు చెందిన విద్యుత్ ఉద్యోగులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రామ్ నగర్లోని విద్యుత్ భవన్ నుంచి జిల్లా పరిపాలనా కేంద్రం కలెక్టరేట్ వరకు విద్యుత్ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీసీపీడీసీఎల్ డిస్కం జేఏసీ చైర్మన్ రాచగర్ల సంజీవరావు, ఏపీసీపీడీసీఎల్ కన్వీనర్ బి.సురేశ్, ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్.హరికృష్ణ, కన్వీనర్ కేవీ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ భవన్ వద్ద యూనియన్ నాయకులు, ఏపీసీపీడీసీఎల్ డిస్కం జేఏసీ చైర్మన్ రాచగర్ల సంజీవ రావు మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం స్కేల్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. మాస్టర్ స్కేలు గరిష్ట పరిమితితో నిమిత్తం లేకుండా వార్షిక, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. అర్హులైన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ ఖాళీల్లో నియమించాలని కోరారు. ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజినీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతిలో ఒక అవకాశం కల్పించాలని, ఫీల్డ్ విభాగంలో తగినంత సిబ్బంది లేనందున వినియోగదారుల సేవల్లో జాప్యం జరుగుతున్న కారణంగా ఎస్ఓపీ నామ్స్ పేరుతో ఉద్యోగుల నుంచి అపరాధ రుసుం మినహాయిస్తున్న విధానాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఆపాలన్నారు. 01.07.1993కు ముందు నియమితులైన ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలన్నారు. ఉద్యోగుల సమస్యల నివారణకు, పూర్వపు పద్ధతిలో మూడు నెలలకు ఒకసారి సర్కిల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పీఎన్సీ సమావేశాలు పునరుద్ధరించాలని కోరారు. గతంలో అంగీకరించిన విధంగా అన్ని విభాగాలలోనూ, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అమల్లో ఉన్న పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలన్నారు. విద్యుత్ సంస్థల్లో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతంచేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సాంకేతికపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని, సమగ్ర విచారణ జరిపిన తదుపరి మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు. ఏపీడీసీఎల్ కన్వీనర్ బి.సురేశ్, ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్.హరికృష్ణ, కన్వీనర్ కేవీ రవి, డి.మనోహర్ సురేష్, రవికాంత్, ఆనందరావు, తేళ్ల జాన్సన్, అంజయ్య, చంద్రశేఖర్, జబ్బార్, బి.వెంకటేశ్వర్లు, నరసింహారావు, వాహబ్, మల్లికార్జున్, అద్దంకి సురేష్, చీరాల మనోహర్, చుక్క రవి, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సెక్రటరీ వెంకట్రావు, బాలాజీ, తదితర నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.
చర్చి సెంటర్లో నిరసన తెలుపుతున్న విద్యుత్ ఉద్యోగులు

విద్యుత్ ఉద్యోగుల నిరసన గళం