
పడకేసిన పల్లె వైద్యం
వైద్యుల డిమాండ్లు ఇవీ...
సర్వీసులో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ రిజర్వేషన్ ఉండేది. ప్రస్తుతం ఈ కోటాను 15, 30 శాతానికి కుదించారు.
ఈ ఏడాది జీఓ నెంబర్ 89 ద్వారా ఆరు బ్రాంచ్ల నిబంధన తెరమీదకు తెచ్చారు. దీని ప్రకారం 15 శాతానికి కుదించిన క్లినికల్ సీట్ల రిజర్వేషన్ రేడియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్తీషియా బ్రాంచీలకు మాత్రమే వర్తింపజేసింది. ఈ అన్యాయాన్ని వైద్యులు ఏడాది కాలంగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు.
ఎంబీబీఎస్ చదివి వైద్యాధికారిగా నియమితులైన వారు పీజీ చదువుకోవడానికి ప్రభుత్వం అనేక షరతులు పెట్టింది. రూ. 50 లక్షలు ష్యూరిటీ ఇవ్వాలని, కనీసం పదేళ్లు ప్రభుత్వ సర్వీసులో అదే హోదాలో పనిచేస్తామంటూ బాండ్ రాయాలని చెబుతోంది.
మెడిసిన్ చదివినా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం తన వద్ద హామీగా పెట్టు కుంటోంది. దీంతో వైద్య వృత్తిలో ఎదుగుదల లేదని, ఇంక పీజీ చదవటం దేనికని పీహెచ్సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న ఎంతోమంది వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదో న్నతులు లేవు. వారికి పదోన్నతులు కల్పిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో పీహెచ్సీల వైద్యుల ఆందోళన ఉధృతం
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది. పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను పట్టించుకోకపోవడంతో గత నెల 26 నుంచి వైద్యు లు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. తొలుత జిల్లాలోని పీహెచ్సీల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రమే అక్కడక్కడ కొనసాగాయి. నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఆన్లైన్ సేవలు, రిపోర్టులు సమర్పణకు బంద్ పాటించారు. అనంతరం నిరవధిక నిరసన లో భాగంగా జిల్లా కేంద్రాల్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం విజయవాడలో పీహెచ్సీల వైద్యులు నిరసన చేపడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా సేవలు అంతంతే...
ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ వైద్యుల సంఘం పిలుపు మేరకు వైద్యులు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో వైద్యసేవలు స్తంభించి పోయాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పీహెచ్సీ లకు విచ్చేసిన రోగులు వైద్యులు లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. పీహెచ్సీల్లో పనిచేస్తున్న నర్సులు సైతం డాక్టర్లు లేరని తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలలో వైద్యులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 39 పీహెచ్సీలు ఉండగా 110 మంది వైద్యులు సేవలందిస్తుండేవారు. ఒక్కో పీహెచ్సీలో ఇరువురు వైద్యులు వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం వైద్యుల సమ్మె కారణంగా అర్బన్ పీహెచ్సీలు, మెడికల్ కళాశాల విద్యార్థులతో ఒక్కో పీహెచ్సీలో ఒక వైద్యున్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు.
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మెబా ట పట్టడంతో 104 వైద్య సేవలపై ఆ ప్రభావం కనిపించింది. పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు ఆరోగ్య కేంద్రంలో, మరొకరు 104 సంచార వైద్య సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. గతంలో 104 వాహనంలో పనిచేసే వైద్యులు నిరసన వ్యక్తం చేసినప్పుడు వారి సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో కూటమి నేతలు, ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. తీరా నిరసన విరమించాక ఏమా త్రం పట్టించుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంలో తిరిగి సేవలందిస్తున్నందుకు ప్రతి నెల అదనంగా రూ. 5 వేలు చెల్లించాలని వైద్యులు కోరుతున్నారు. అవి అందించకపోవడంతో 104 వైద్య సేవలు ఆగిపోయాయి. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది కేవలం మందుల పంపిణీ మాత్రమే చేపడుతున్నారు.

పడకేసిన పల్లె వైద్యం

పడకేసిన పల్లె వైద్యం