కోస్గి రూరల్: జీవితంలో అవకాశాలు ఎల్లప్పు డు వస్తుంటాయని, వాటిని గుర్తించి క్రమశిక్షణ, నిజాయితీ, సృజానాత్మకతతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టిన డిప్లొమా విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల త్యాగం, గురువుల మార్గదర్శనానికి విద్యార్థుల కృషి తోడైతే లక్ష్యాలు చేరుకుంటారన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, హెచ్ఓడీలు వసంతకుమారి, మీన, వెంకటాద్రి, వెంకట్రెడ్డి, విద్యా ర్థుల తల్లిదండ్రలు తదితరులు ఉన్నారు.
మద్దూరు ఘటనపై విచారణ చేయించాలి
నారాయణపేట రూరల్: మద్దూరు మండలంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల అరాచకాలను భరించలేక ఒక గిరిజన యువకుడు రమేష్ ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించి సమగ్ర విచారణ జరపాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్నాయక్ డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీతో కలిసి మంగళవారం నారాయణపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మద్దూరులో ఇస్లామిక్ వాదులు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకు తాజోద్దీన్, యాసిన్ వ్యాపారం నిర్వహిస్తూ అప్పులు ఇస్తామని ఎరవేస్తూ.. డబ్బులు ఇవ్వకుండానే అప్పు ఇచ్చినట్లు సంతకాలు చేయించుకుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
బంగారు నాణేల పేరుతో నకిలీ ఇచ్చి డబ్బుల దండుకుంటున్నారన్నారు. మతం మారితే రూ.2 లక్షలు ఇస్తామని, పాకిస్థాన్కు ఏజెంట్గా వ్యవహరించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇది వరకే రాంచంద్రప్ప వారి ఒత్తిడితో మృతి చెందాడన్నారు. రాంచంద్రప్ప, తాజొద్దీన్ ఫోన్లను సీజ్ చేసి పరిశీలిస్తే వాస్తవాలు బయట పడతాయని సూసైడ్ నోట్లో తెలిపాడన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీగౌడ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
మద్దూరు: సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన రమేష్నాయక్ కుటుంబాన్ని మంగళవారం బీజేపీ నాయకులు పరామర్శించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బోడమరిగుట్టతండాలో ఆయన తల్లిదండ్రులు తారాబాయి, దమ్లానాయక్ ను కలిసి ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, దౌల్తాబాద్ అధ్యక్షుడు అశోక్, మద్దూర్ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మన్యంకొండలో వైభవంగా కల్యాణోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ వేడుకను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మళ్లీ పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు.

విజయానికి సృజనాత్మకత తప్పనిసరి

మన్యంకొండలో వైభవంగా కల్యాణోత్సవం