
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా నేపథ్యంలో మహబూబ్నగర్ రీజియన్కు రూ.33.64 కోట్ల ఆదాయం
ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
– స్టేషన్ మహబూబ్నగర్
దసరా పండుగ రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్నగర్ రీజియన్లో ఓఆర్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం
పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు
63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం

ఆర్టీసీకి ‘పండుగే’!