
బోనస్ బకాయిలు రూ.70.44 కోట్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మాగనూర్ మండలం నేరడుగాం గ్రామానికి చెందిన రైతు లియాకత్ అలీ. యాసంగిలో సొంత పొలం పది ఎకరాలు, కౌలుకు తీసుకొని 40 ఎకరాల్లో సన్నరకం ధాన్యం పండించారు. మొత్తం 1,300 క్వింటాళ్ల దిగుబడి రాగా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. క్వింటాకు రూ.2,320 చొప్పున మద్దతు ధర డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డాయి. బోనస్ రూ.6.50 లక్షలు ఇంతవరకు రాలేదు. సకాలంలో చేతికంది ఉంటే పంట పెట్టుబడికి ఉపయోగపడేవని చెబుతున్నారు.
నారాయణపేట: యాసంగి సీజన్ సన్నరకం వరి ధాన్యం బోనస్ కోసం రైతులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరున ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై జూన్ మొదటి వారం వరకు కొనసాగాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. అందులో 1,40,983 ఎంటీఎస్ సన్నరకం, 57,299 ఎంటీఎస్ దొడ్డు రకం ఉంది.
క్వింటాకు రూ.500 చొప్పున..
యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంది. కొనుగోళ్లు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేక బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్నది బహిరంగ రహస్యమే. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ పంట కొనుగోళ్లు ప్రారంభం కానుండటం.. ఇప్పటి వరకు యాసంగి బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి పౌరసరఫరాల సంస్థ వారి ఖాతాల్లో రూ.460,01,65,600 జమ చేసింది. కానీ సన్నరకం ధాన్యం బోనస్ డబ్బులు 1,40,983 ఎంటీఎస్కుగాను రూ.70.44 కోట్లు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క రూపాయి అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలం కొనుగోళ్లకు ప్రణాళికలు..
రాష్ట్రంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. నెలాఖరునే పంట కోతలు ప్రారంభం కానుండటంతో అక్టోబర్ మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్టోబర్ నుంచి 2026, జనవరి వరకు కొనసాగనుంది.
సన్నాల సాగుకే మొగ్గు..
ఈసారి వానాకాలంలో జిల్లా రైతులు సన్నాల సాగుకే మక్కువ చూపారు. దొడ్డురకం 14,981 హెక్టార్లు, సన్నరకం 56,082 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 96,249 ఎంటీఎస్ దొడ్డురకం, 3.32 లక్షల మె.ట. సన్నరకం దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కొత్తపల్లి తండాకు చెందిన రైతు పాండునాయక్. ఈ ఏడాది యాసంగిలో మూడు ఎకరాల పొలంలో సన్నరకం వరి ధాన్యం పండించగా 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించగా రూ.1,03,500 బ్యాంకు ఖాతాలో జమైంది. బోనస్ రూ.22,500 మూడు నెలలవుతున్నా ఇంతవరకు జమ కాలేదు.
యాసంగి డబ్బుల కోసంరైతన్నల ఎదురుచూపు
1.40 లక్షల ఎంటీఎస్ కొనుగోలు
వానాకాలం వరి కొనేందుకుప్రణాళికలు సిద్ధం
అన్నదాతల ఆందోళన

బోనస్ బకాయిలు రూ.70.44 కోట్లు

బోనస్ బకాయిలు రూ.70.44 కోట్లు