
మౌలిక వసతులపై సర్వే
పక్కా ప్రణాళిక..
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే చేపట్టాం. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వసతులు, ఇంకా చేపట్టాల్సిన పనులు, అందులో అత్యంత ఆవశ్యకత కలిగిన వాటిని నమోదు చేస్తున్నాం. ఈ సర్వే ద్వారా గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు అవసరం ఉందో తక్షణం తెలియనుంది. అన్ని గ్రామాల్లో వసతులు మెరుగుపడనున్నాయి.
– సుధాకర్రెడ్డి, ఇన్చార్జి డీపీఓ
నర్వ: గ్రామపంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా గ్రామాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా జీపీ మానిటరింగ్ యాప్ను నవీకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 270 గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు రెండు రోజుల క్రితం సర్వే ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవనంతో సహా ప్రభుత్వ ఆస్తుల వివరాలతో పాటు ప్రజలకు కల్పించాల్సిన వసతుల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరు వరకు సర్వేను పూర్తిచేయాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు.
21 అంశాలతో ప్లానింగ్..
ఈ సర్వేలో 21 అంశాలకు సంబంధించిన సమగ్ర మౌలిక వసతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇదివరకే పంచాయతీ కార్యదర్శులు వినియోగిస్తున్న జీపీ మానిటరింగ్ యాప్ను నవీకరించి సర్వేకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు. కార్యదర్శులు గ్రామపంచాయతీ భవనంతో సహా అంగన్వాడీ కేంద్రం, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, ప్రభుత్వ పాఠశాల, వైకుంఠధామం, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, పల్లె ప్రకృతివనం, సీసీ రహదారులు, అనుబంధ గ్రామాల రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, వరద, మురుగు కాల్వలు, తాగునీరు, వీధి దీపాలు, పశువుల నీటితొట్లు, గ్రంథాలయాల తదితర వాటిని పరిశీలించి.. అందులో ఉన్న వసతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేతో పంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో ఎలాంటి వసతులున్నాయి.. సమస్యలు ఏంటి.. ప్రజల అవసరాలు. కల్పించాల్సిన వసతులు ఏంటనే లెక్క తేలుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
జీపీ మానిటరింగ్ యాప్లో వివరాల నమోదు
21 అంశాలతో పనుల గుర్తింపు ప్రక్రియ
జిల్లాలో కొనసాగుతున్న సర్వే ప్లానింగ్
గ్రామాల్లో వసతుల మెరుగుకు ఎంతో ప్రయోజనమంటున్న అధికారులు
జీపీఐడీపీ యాప్ ప్రత్యేకత..
గ్రామాల్లో మౌలిక వసతులను తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. జీపీఐడీపీ (గ్రామపంచాయతీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్) యాప్లో పంచాయతీ కార్యదర్శులు తమ డీఎస్ఆర్ (డెయిలీ శానిటేషన్ రిపోర్టు)తో పాటు ఈ యాప్లో పొందుపరిచిన 21 అంశాల్లో మౌలిక వసతుల వివరాలను నమోదు చేయాలి. అయితే మౌలిక వసతులు కల్పించే సంవత్సరం, కావాల్సిన నిధులు, ఎక్కడి నుంచి నిధులు తీసుకోవాలనే వివరాలు యాప్లోనే ఉంటాయి. నమోదు చేయగానే ఆ వివరాలు క్యాప్చర్ అవుతాయి. ఇలాంటి ప్రత్యేక యాప్ ద్వారా పక్కా ప్రణాళిక రూపొందించనున్నారు.

మౌలిక వసతులపై సర్వే

మౌలిక వసతులపై సర్వే