
ఇవీ డిమాండ్లు..
కోవెలకుంట్ల: సమగ్ర శిక్ష, విద్యాశాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ చిరు ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 168 మంది సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల్ లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్టినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వేతనాలు అందక, సంక్షేమ పథకాలు వర్తించక కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువు, వైద్య, ఇతర ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితులతో అల్లాడిపోతున్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వంలో అందని వేతనాలు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. అరకొరగా వస్తున్న వేతనాలు సైతం రెండు నెలల నుంచి అందడం లేదు. వేతనాల పెంపు అటుంచితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడస్తున్న పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని ఈ ఏడాది జనవరి నెలలో జీవోనంబర్–2ను విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఖాళీపోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే అర్హులుగా తేల్చింది. ఈ జీఓ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని ఉద్యోగులు వాపోతున్నారు.
తప్పని వెట్టి చాకిరి
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతని పనిచేస్తున్న సీఆర్ఎంటీఎస్లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తోంది. ఈ ఏడాది జూన్నెలలో పాఠశాలలు పున:ప్రారంభం కాగా ఉపాధ్యాయుల బదిలీలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ అదే నెలలో ఉండటంతో పనిభారం సీఆర్ఎంటీఎస్లపై పడింది. జిల్లాలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో వీరు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. సీఆర్ఎంటీఎస్లను డిప్యూటేషన్లపై ఇతర పనులు అప్పగించమని ప్రకటించినా ఆచరణలో అమలు కాలేదు. ఏకారణంతోనైనా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోతే ఆ స్థానాల్లో సీఆర్ఎంటీఎస్లు వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు.
అమలు కాని హామీలు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ చేర్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, నూతన రేషన్కార్డులు, తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేసినా కొందరికి మాత్రమే షరతులు విధించారు. నిత్యావస ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
జిల్లాలోని ఆయా మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాల్లో 91 మంది సీఆర్ఎంటీఎస్లు, 19 మంది మండల్ లెవల్ అకౌంటెంట్లు, 29 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 29 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. వీరికి గతంలో నెలకు రూ. 18,500 వేతనం అందేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020వ సంవత్సరం వేతనాన్ని రూ. 23,500లకు పెంచింది. అప్పటి నుంచి వీరికి ఈ వేతనం అందుతోంది.
ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలు చేయాలి.
రద్దు చేసిన ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యుల వృద్ధాప్య పింఛన్లు పునరుద్ధరించాలి.
అంగన్వాడీ, ఆశావర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ రిటైర్డ్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇదే విధానాన్ని అమలు చేయాలి.
జిల్లాలో 168 మంది కాంట్రాక్ట్,
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
వేతనాలు అందక, సంక్షేమ పథకాలు
వర్తించక అవస్థలు
ఉద్యోగుల కుటుంబాల్లో ఆకలి కేకలు
సంక్షేమ పథకాలు
వర్తింప చేయాలని డిమాండ్

ఇవీ డిమాండ్లు..