చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు

Sep 20 2025 6:34 AM | Updated on Sep 20 2025 6:58 AM

ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం ● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

రహదారుల్లో తనిఖీలు చేస్తూ..

‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమంపై పోలీసుల ఉక్కుపాదం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల అడ్డగింతలు, అరెస్ట్‌లు ప్రధాన రహదారుల్లో బారికేడ్లు పెట్టి వాహనాల తనిఖీలు బలవంతంగా జీపులు, వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలింపు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడిన నేతలు

నంద్యాల: కూటమి ప్రభుత్వం ప్రజాస్వేచ్ఛకు సంకెళ్లు వేసింది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ‘చలో మెడికల్‌ కాలేజ్‌’ కార్యక్రమాన్ని పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నించింది. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎవరూ నంద్యాలకు రాకుండా అడ్డుకుంది. పోలీసు యాక్టు 30 అమలులో ఉందంటూ పోలీసులను మోహరించి బలవంతంగా అరెస్ట్‌లకు పాల్పడింది. నంద్యాల మెడికల్‌ కళాశాల వైపు వచ్చే అన్ని రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఉంటే వారిని వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని.. తమను అడ్డుకోవద్దని పోలీసులను ఎంత వేడుకున్నా కనికరించ లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీసుల కళ్లు గప్పి కొందరు మెడికల్‌ కళాశాల వద్దకు చేరుకున్నా బలవంతంగా జీపుల్లో, లారీల్లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. చలో మెడికల్‌ కాలేజ్‌ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు తరలి వస్తారనే సమాచారంతో గురువారం రాత్రి నుంచే అడ్డంకులు సృష్టించేందుకు పోలీ సులు సిద్ధమయ్యారు. పోలీసుల బెదిరింపులకు భయపడకుండా ఆయా నియోజకవర్గాల నుంచి తరలివస్తున్నా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. మెడికల్‌ కళాశాల వద్దకు వచ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, కొండ జూటూరు సర్పంచ్‌ సద్దల సుజిత్‌రెడ్డితో పాటు మరో 100 మందిని బలవంతంగా పోలీసులు అరెస్ట్‌ చేసి పట్టణంలోని త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు.

నంద్యాల పట్టణంలోని మెడికల్‌ కళాశాల వద్దకు ఎవరో రాకుండా అడ్డుకోవడానికి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని సీఐలు, ఎస్‌ఐలు అందరూ మెడికల్‌ కళాశాల వద్ద మోహరించారు. మెడికల్‌ కళాశాల వద్దకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎవరూ రాకుండా నూనెపల్లెలోనే ఆసుపత్రి వద్ద, రైతునగరం బ్రిడ్జి వద్ద, బొమ్మలసత్రంలోని గాంధీనగర్‌ వద్ద సీఐలు, ఎస్‌ఐలు ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన తర్వాతనే పంపారు. వాహనంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉంటే వారిని కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకొని వెనక్కి పంపారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, మండ ల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎవరూ కళాశాల వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నల సాయిరాంరెడ్డిని స్వగృహంలో అరెస్ట్‌ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ మాబున్నిసాను గాంధీనగర్‌ వద్ద ఆపి కార్యక్రమానికి రాకుండా వెనక్కి పంపించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్‌, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అమృతరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, మరో 100 మందికి పైగా కార్యకర్తలు మెడికల్‌ కళాశాల వద్దకు చేరుకోగా వారిని బలవంతంగా పోలీసులు అరెస్ట్‌ చేసి జీపుల్లో, లారీల్లో త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి సాయంత్రం విడుదల చేశారు.

నంద్యాల మెడికల్‌ కళాశాల వద్ద మోహరించిన పోలీసు బలగాలు

కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెనుకడుగు వేసే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామ ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్‌ హెచ్చరించారు. చంద్రబాబు మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకొని చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే దానిని పోలీసులతో అణిచివేసి ప్రజాస్వేచ్ఛను కాలరాస్తున్నారన్నారు. అరెస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడరని, మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.

నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ధారా సుధీర్‌ ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి పైగా నంద్యాలకు వస్తుండగా పట్టణ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.

బనగానపల్లె నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు అంబటి రవికుమార్‌, సిద్ధంరెడ్డి రామిరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డిలతో పాటు మరో 300 మంది కార్యక్రమానికి వేర్వేరుగా వస్తుండగా కొందరినీ నందవరం వద్ద, మరికొందరిని నంద్యాల బొమ్మలసత్రంలోని గాంధీనగర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

డోన్‌ నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌, పార్టీ నేతలు కిట్టిరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ పుల్లారెడ్డి, మరో 200 మంది నంద్యాలకు వస్తుండగా బేతంచెర్ల వద్ద పోలీసులు అరెస్ట్‌ చేసి సాయంత్రం వదిలేశారు.

ఆళ్లగడ్డ వైఎస్సార్‌సీపీ యూత్‌వింగ్‌ అధ్యక్షుడు శీను, స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షుడు కుమార్‌ ఆధ్వర్యంలో భారీగా ప్రజలు చలో మెడికల్‌ కాలేజీ కార్యక్రమానికి వస్తుండగా రైతునగరం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు ఆపి అడ్డుకున్నారు.

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

హౌస్‌ అరెస్టు..

‘చలో నంద్యాల మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని కర్నూలు మూడవ పట్టణ పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకే పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని మోహరించారు. విషయం తెలుసుకున్న యువజన విభాగం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శాంతి యుతంగా చేపడుతున్న కార్యక్రమానికి సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి బైరెడ్డి సిద్దార్థ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

నలువైపులా మోహరించి..

చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు 1
1/3

చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు

చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు 2
2/3

చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు

చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు 3
3/3

చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement