
బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే..
డిఫాల్ట్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిపుల్లేవ్
● జిల్లాలో మొత్తం 145 రైస్మిల్లులు
● ప్రస్తుతం 45 మిల్లులకే ప్రతిపాదనలు
● మిల్లింగ్ కెపాసిటీలో పది శాతం తప్పనిసరి
నాగర్కర్నూల్: జిల్లాలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రతి ఏటా ఆయా రైస్ మిల్లులకు కేటాయిస్తుంటారు. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అయితే రైస్మిల్లులకు ధాన్యం కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరగుతున్నాయని, పలు రైస్ మిల్లర్లు సీఎమ్మార్ ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవకతవకలకు పాల్పడిన మిల్లులకు ధాన్యం కేటయించొద్దని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ అయిన మిల్లు కు ధాన్యం కేటాయించడం నిలిపివేయడంతో పా టు మిగతా మిల్లులకు సైతం బ్యాంక్ గ్యారంటీ ఉంటేనే ధాన్యాన్ని కేటాయించేలా ఆదేశాలు జారీ చేశా రు. జిల్లాలో మొత్తం 145 రైస్మిల్లులు ఉండగా.. వానాకాలం సీజన్లో 45మిల్లులకు ధాన్యాన్ని కుటాయించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వీటి సంఖ్య గతేడాది 46 ఉండగా.. కల్వకుర్తికి చెందిన ఒక మిల్లును డిఫాల్ట్ లిస్టులో చేర్చారు.
7 కేసులు నమోదు
జిల్లాలో 2022 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎమ్మార్ బియ్యం ఇవ్వకపోవడంతో పాటు ఆ బియ్యం మిల్లుల్లో కూడా లేకపోవడంతో అధికారులు ఇప్పటి వరకు 7 కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు కేసులు 2024లో నమోదు చేయగా.. ఈ ఏడాది ఐదు క్రిమినల్ కేసులు పెట్టారు. కల్వకుర్తికి సంబంధించి ఇప్పటి వరకు 7మిల్లులపై, నాగర్ర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు పరిధిలోని ఒక రైస్ మిల్లుపై చర్యలకు ఉపక్రమించారు. ఈ మిల్లులకు సంబంధించిన ఇండస్ట్రీస్ పేరుపై ఉన్న భూములను, ఆస్తులను ఎవరి పేరుపై మార్చకుండా ఫ్రీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా మరి కొన్ని రోజులు గడువు ఉండడంతో యాసంగాలో తీసుకున్న ధాన్యానికి సంబంధించి 70 శాతం సీఎమ్మార్ ఇచ్చిన రైస్ మిల్లులకు, గత వానాకాలానికి సంబంధించి వంద శాతం సీఎమ్మార్ ఇచ్చిన రైస్మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని కేటాయించేలా అధికారులు నిబంధనలు విధించారు. దీంతోపాటు ఇకపై మిల్లులకు ధాన్యాన్ని కేటాయించేందుకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి చేయడంతో అక్రమాలు పాల్పడే ఆస్కారం తగ్గనుంది.
కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తున్న అధికారులు (ఫైల్)
బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే
మిల్లర్లకు ధాన్యం కేటాయించాలంటే మిల్లింగ్ కెపాసిటీలో పది శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే. దీంతోపాటు గతంలో వారికి కేటాయించిన ధాన్యానికి సంబంధించి వానాకాలం సీజన్కు సంబంధింయి వంద శాతం, యాసంగి సీజన్కు సంబంధించి సీఎమ్మార్ 70 శాతం ఇవ్వాలి. లేకుంటే కేటాయింపులు ఉండవు. ప్రతీ యేటా సీఎంఆర్ చెల్లించని మిల్లును డిఫాల్ట్ లిస్టులో చేర్చుతూ వస్తున్నాం. వీటితో పాటు సదరు మిల్లులపై చర్యలు కూడా తీసుకుంటున్నాం.
– రాజేందర్, సివిల్ సప్లై డీఎం

బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే..