
పెద్ద ధన్వాడలో గందరగోళం
రాజోళి: మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు మంగళవారం ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. పెద్ద ధన్వాడ శివారులో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ సిబ్బంది మంగళవారం కంటైనర్, ఇతర సామగ్రిని ప్యాక్టరీ స్థలం వద్దకు తీసుకొచ్చారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు రాగా.. రైతులు, స్థానికులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందిస్తూ అక్కడకు చేరుకున్నారు. ఫ్యాక్టరీ పనులు చేపడుతున్నారని, దాని కోసం ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విషయం తెలుసుకున్న సీఐ టాటా బాబు, ఎస్ఐ జగదీశ్ అక్కడకు చేరుకుని రైతులు, ఫ్యాక్టరీ సిబ్బందితో మాట్లాడారు. ఫ్యాక్టరీ సిబ్బంది తమ స్థలానికి హద్దులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, సిబ్బంది ఉండేందుకు కంటైనర్ ద్వారా షెల్టర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పనులు ప్రారంభించడం లేదని తెలిపారు. పోలీసులు విషయాన్ని రైతులకు తెలియడంతో పాటు ధర్నాలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి చేయడంతో వారు ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొందర్లోనే తమ కార్యాచరణ సిద్ధం చేసి, ఇథనాల్ కంపెనీ వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఫ్యాక్టరీ అంశంపై కలిసి రావాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలు కోరుతున్నారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు
పోలీసుల జోక్యంతో శాంతించిన రైతులు