
కానరాని సెల్లార్!
వాణిజ్య భవనాల్లో పార్కింగ్ తప్పనిసరి
మహబూబాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పెరుగుతున్న జనాభాతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. ప్రధానంగా బహుళ అంతస్తులు, కమర్షియల్ భవనాల్లో సెల్లార్ల నిర్మాణాలు లేకపోవడంతో సమస్య వస్తోంది. కొన్నిచోట్ల కాసులకు కక్కుర్తిపడి సెల్లార్లను షాపుల నిర్వహణకు అద్దెకు ఇచ్చారు. మానుకోట మున్సిపాలిటీలో ఈ తరహా షాపుల నిర్వహణ కొనసాగుతోంది. దీంతో వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేస్తుడడంతో ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.
జిల్లాలో 5 మున్సిపాలిటీలు..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 57,828 మంది ఓటర్లు, 68,889 మంది జనాభా, 26,000 పైగా గృహాలు ఉన్నాయి. తొర్రూరు మున్సి పాలిటీలో 16వార్డుల్లో 19,100 జనాభా ఉంది. మరి పెడలో 15 వార్డుల్లో 17,875 మంది జనాభా, డోర్నకల్లో 15వార్డులు, 14,425మంది జనాభా, 4,132 గృహాలు ఉన్నాయి. ఇటీవలే కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన విషయం తెలిసిందే.
పార్కింగ్ స్థలం తప్పనిసరి..
కమర్షియల్ భవనాలు, బహుళ అంతస్తులకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలి. లేకుంటే సెల్లార్ నిర్మాణాలు చేపట్టాలి. కాగా చాలా మంది సెల్లార్ అనుమతి తీసుకుంటున్నారు. కానీ, నిర్మాణాలు చేపట్టడంలేదు. 500గజాల స్థలం అయితే మున్సి పాలిటీ కార్యాలయంలోనే అనుమతులు ఉంటా యని, డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్) నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుందని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఆన్లైన్లోనూ మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తు చేసుకుంటే ఆ పత్రాలను డీటీసీపీకి పంపిస్తే వారి ఆదేశాల మేరకు అధికారులు వెరిఫై చేసి అనుమతులు ఇస్తారు. కాగా, రోడ్డు వెడల్పు ఇతర అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని అనుమతులు ఇస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
పదింటికి మాత్రమే..
మానుకోట మున్సిపాలిటీలో కమర్షియల్ భవనాల్లో ఏడు సెల్లార్ల కోసం అనుమతులు తీసుకున్నా ఐదు మాత్రమే నిర్మాణాలు చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. తొర్రూరులో అసలు సెల్లార్లు లేవని ఇన్చార్జ్ టీపీఎస్ ప్రవీణ్ తెలిపారు. మరిపెడలో ఎనిమిది అనుమతులు తీసుకుని ఐదు నిర్మాణాలు చేశారని అధికారులు తెలిపారు. డోర్నకల్, కేసముద్రంలో లేవని తెలిపారు. వారి లెక్కల ప్రకారం 10 మాత్రమే సెల్లార్లు ఉన్నాయి. కాగా అన్ని అపార్ట్మెంట్లలో సెలార్లు ఉన్నాయి.
నోపార్కింగ్ బోర్డులు..
ట్రాఫిక్ సమస్యను గమనించిన పోలీసులు కమర్షియల్ భవనాల ఎదుట నోపార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆభవనాల్లో బ్యాంక్లు ఉండడడంతో అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలకు పోలీసులు జరిమానా విధిస్తున్నారు. గతంలో మానుకోట పట్టణ పరిధిలో సెల్లార్లలో షాపులు నడుపుతున్న భవనాల యాజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు పార్కింగ్ లేని బహుళ అంతస్తుల యజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ చర్యలు లేకపోవడంతో పార్కింగ్పై దృష్టిపెట్టడం లేదు.
ఇందిరాగాంధీ సెంటర్లోని కమర్షియల్ భవనం ఎదుట ఏర్పాటు చేసిన నో పార్కింగ్ బోర్డు
●
పార్కింగ్ స్థలం ఉండాలి
500 గజాల లోపు బహుళ అంతస్తులకు మున్సిపాలిటీ కార్యాలయంలోనే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ స్థలం కేటాయించాలి. లేకపోతే తప్పనిసరిగా సెల్లార్ నిర్మాణం చేపట్టాలి. 500 గజాలు దాటితే డీటీసీపీ ద్వారా అనుమతి వస్తుంది. పార్కింగ్ లేదా సెల్లార్ లేని బహుళ అంతస్తులు, కమర్షియల్ భవనాల యజమానులకు నోటీసులు ఇస్తాం. సెల్లార్లను కిరాయికి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం. – టి.రాజేశ్వర్,
మానుకోట మున్సిపల్ కమిషనర్
సెల్లార్లు లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు
రోడ్లపై వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్ సమస్య
కొన్నిచోట్ల సెల్లార్లలో షాపుల ఏర్పాటు
ట్రాఫిక్ సమస్య..
ఐదు మున్సిపాలిటీల పరిధిలో సెల్లార్లు లేక పోవడంతోనే ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. జనాభా పెరుగుతుండడంతో ఈ సమస్య జఠిలమైంది. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. నెహ్రూ సెంటర్లో రెండు కమర్షియల్ భవనాలను సెల్లార్లతో నిర్మాణాలు చేశారు. అయితే కాసులకు కక్కుర్తి పడి సెల్లార్ ప్రాంతాలను షాపులకు అద్దెకు ఇచ్చారు. ఆరోడ్డులో ఒక్క షాపు అద్దె రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఉంది. దీంతో సెల్లార్లలో కూడా షాపులు ఏర్పాటు చేశారు. ఆరెండు కమర్షియల్ భవనాల్లో బ్యాంక్లు ఉన్నాయి. దీంతో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది.

కానరాని సెల్లార్!