
మాంసం విక్రయాలు చేయొద్దు
మహబూబాబాద్: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గురువారం ఎట్టి పరిస్థితుల్లో మాంసం, చికెన్, చేపల విక్రయాలు జరపవద్దని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేశ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మాంసం, చికెన్ విక్రయ షాపుల యజమానులకు బుధవారం ఆయన నోటీస్లు అందజేశారు. రాజేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీస్లు అందజేశామన్నారు. కర్రీ పాయింట్, రెస్టారెంట్లలో కూడా మాంసం వంటకాలు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జరిమానావిధించడంతో పాటు షాపు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
మహబూబాబాద్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని గ్రామాల్లో ప్రజలు బీజేపీకే మొగ్గుచూపుతున్నారని, మోదీ అందించిన ఎన్నో గొప్ప పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర నాయకులు యాప సీతయ్య, క్యాచ్యువల్ శ్యాంసుందర్ శర్మ, ధర్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు చీకటి మహేశ్, గడ్డం అశోక్ కుమార్, మదన్ నాయక్, జిల్లా నాయకులు చేలుపురి వెంకన్న, పొదిలా నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శీను, పద్మ, మోదిన్ నాయక్, సింగారపు సతీష్, పల్లె సందీప్ కుమార్, వెన్నమల్ల సందీప్ కుమార్, కృష్ణమోహన్, మండల అధ్యక్షులు కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలకు గోవా రాష్ట్ర వై ద్య, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, గోవా ఎమ్మెల్యేలు దేవ్యారాణే, ఐశ్వర్యరాణే, అరుంధతి రాణే ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం పుష్పరథసేవ నిర్వహించారు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్కు చెందిన పర్యాటకుడు నికోలస్ సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ శిల్పకళ విశిష్టతను గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం నికోలస్ లక్ష్మీదేవిపేటలో దసరా క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలను వీక్షించారు. అమరావతి విద్యాలయం మైదానంలో జరిగిన ఫైనల్ పోటీల్లో పట్వారిపల్లి, నర్సింగాపూర్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో లక్ష్మీపురం ప్రథమ బహుమతి, నర్సింగాపూర్ ద్వితీయ బహుమతి, బూర్గుపేట తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీలు అద్భుతంగా జరిగాయని, క్రీడాకారులు బాగా రాణించారని నికోలస్ ప్రశసించారు. నర్సింగాపూర్కు చెందిన తన మిత్రుడి ఇంటికి వచ్చిన సందర్భంలో నికోలస్తో పలువురు గ్రామస్తులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు.

మాంసం విక్రయాలు చేయొద్దు