
వేడివేడి.. టేస్టీ టేస్టీగా
కాజీపేట : ట్రై సిటీలోని అనేక ప్రాంతాల్లో ఉడక బెట్టిన, కాల్చిన కంకులు తినడానికి ప్రజలు మక్కువ చూపుతున్నారు. ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో తోపుడుబండ్లపై కాల్చిన, ఉడకబెట్టిన మొక్క జొన్న కంకులను విక్రయిస్తూ చిరు వ్యాపారులు, కొందరు రైతులు, మరికొందరు అడ్డా కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ సీజన్లో మక్క కంకుల విక్రయం జోరుగా సాగుతోంది.
కంకులకు భలే డిమాండ్..
నగరంలో దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో చిన్న బొగ్గుల పొయ్యి ఏర్పాటు చేసుకొని కాల్చిన మొక్కజొన్న కంకులు విక్రయిస్తున్నారు. ప్రతీ ఏటా వేడివేడి మొక్కజొన్న కంకులకు ఆదరణ పెరగడంతో కాల్చి విక్రయించే కేంద్రాలు పెరిగిపోతున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో మొక్కజొన్న కంకుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే, ఉడకబెట్టి కంకులను విక్రయిస్తున్నారు. రూ.15నుంచి రూ.20లకు ఒక కంకి చొప్పున అమ్ముతున్నారు.
బస్తీబస్తీ తిరుగుతూ...
రెండేళ్ల నుంచి తోపుడు బండ్లపై మొక్కజొన్న కంకుల విక్రయాలు పెరుగుతున్నాయి. సాధారణంగా పొట్టు తీసి కాల్చడం కంటే పొట్టుతో సహా కాలిస్తే గింజలు మరింత రుచిగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది జూలై నుంచే మక్క కంకులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో రైతులే నేరుగా..
కొన్ని ప్రాంతాల్లో రైతులే నేరుగా మొక్కజొన్న కంకులను విక్రయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాల రైతులు పండించిన మొక్కజొన్న కంకులను వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ నగరంలోని ప్రత్యేక అడ్డాల్లో కంకులను హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించడం వల్ల కొంత లాభం వస్తున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పడంలేదని వారు ఆవేదన చెందుతున్నారు.
వానాకాలం, చలి కాలాల్లో ఎక్కువగా మొక్కజొన్న కంకులకు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మండల కేంద్రాలు, రహదారుల పక్కన విక్రయిస్తు ఉంటారు. రోడ్లకు ఇరువైపులా కాల్చిన, ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులను ప్రయాణికులు కొనుగోలు చేసి తింటుంటారు. అడ్డా కూలీలు, కొందరు రైతులు మొక్కజొన్న పొత్తులను నగరానికి తీసుకొచ్చి విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
కాల్చిన, ఉడకబెట్టిన మొక్కజొన్న
కంకులకు భలే డిమాండ్

వేడివేడి.. టేస్టీ టేస్టీగా

వేడివేడి.. టేస్టీ టేస్టీగా