
చిన్నారులతో మండుటెండల్లో పనులు
కొత్తగూడ: చిన్న పిల్లలు అనే దయ లేదు.. కూలీ డబ్బులు మిగులుతాయని కక్కుర్తిపడి ఓ తునికాకు కాంట్రాక్టర్.. చిన్నారులకు రూ.20 ఇస్తానని ఆశ చూపి మండుటెండలో కల్లంలో పనులు చేయించడం మండలంలో చర్చనీయాశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పూనుగొండ్ల యూనిట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మండలంలోని దుర్గారం గ్రామంలో తునికాకు సేకరిస్తున్నాడు. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి కట్టలు తడిశాయి. వాటిని దులుపుకుంటూ తిప్పి పెట్టాల్సి ఉంటుంది. అందుకు పెద్దవారిని పనికి పిలిస్తే ఒకరికి కూలీ రూ.400 ఇవ్వాల్సి వస్తుంది. అది మిగిల్చుకోవాలనే కక్కుర్తితో స్థానికంగా కనిపించిన చిన్నారులకు రూ.20 ఇస్తానని చెప్పి మండుటెండలో పనులు చేయించాడు. చిన్నారులు పనులు చేస్తుంటే సదరు కాంట్రాక్టర్ కింద పనిచేసే గుమస్తా.. చెట్టు నీడన ఉండి త్వరగా పని చేయండి అంటూ.. హుకుం జారీ చేయడంతో చిన్నారులు మండుటెండలో కట్టలను మార్చారు. ఈవిషయం కాస్త సోషల్ మీడియాలో రావడంతో ఆదివాసీ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు మండి పడుతున్నాయి. ఎండ తీవ్రతకు చిన్నారులకు ఏదైనా జరగరానికి జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.