అప్రమత్తంగా లేకపోతే ముప్పే | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా లేకపోతే ముప్పే

May 6 2025 12:40 AM | Updated on May 6 2025 12:40 AM

అప్రమ

అప్రమత్తంగా లేకపోతే ముప్పే

● గ్యాస్‌తో జాగ్రత్తలు తప్పనిసరి ● వణికిస్తున్న గ్యాస్‌ సంబంధిత ప్రమాదాలు ● మిట్టపల్లి ఘటనలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

సత్తుపల్లిటౌన్‌: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న వంటింటి గ్యాస్‌ ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో ఈ ప్రమాదాలు జరుగుతుండగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాల మీదకు వస్తుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, గృహ వినియోగదారులకు స్టౌ, రెగ్యులేటర్‌ తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్యాస్‌ కంపెనీలు కూడా అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని..

● సత్తుపల్లిలోని హనుమాన్‌నగర్‌కు చెందిన అడపా శ్రీరాంమూర్తి – కుమారి దంపతులు 2023లో జరిగిన గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో మరణించారు.

● ఎన్టీఆర్‌నగర్‌లోని తడికమళ్ల ప్రకాశరావు నివానంలో గ్యాస్‌ లీకేజీతో మంటలు వ్యాపించగా ఆస్తినష్టం సంభవించింది.

● ద్వారకాపురి కాలనీలోని వెంకటేశ్వరరావు నివాసంలో ఆరుబయట వంట చేస్తుండగా గ్యాస్‌లీక్‌ కావటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 1.50లక్షల ఆస్తి నష్టం జరిగింది.

● సత్తుపల్లి చర్చి రోడ్డులోని బాబీ నివాసంలో వంట చేస్తుండగా గ్యాస్‌పైప్‌ లీక్‌ అయి మంటలు అంటుకున్నాయి.

● తల్లాడ మండలం మిట్టపల్లిలో ఇటీవల గ్యాస్‌ లీక్‌ అయి మంటలు వ్యాపించిన ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఓ వృద్ధురాలు మృతి చెందారు.

లీకేజీలను గుర్తించడం..

● గ్యాస్‌ సిలిండర్‌ రెగ్యులేటర్‌, బుష్‌ వద్ద శబ్దం వచ్చినా.. వదులుగా తిరుగుతున్నా నిర్లక్ష్యం చేయొద్దు.

● సిలిండర్‌ ఇచ్చినప్పుడే గ్యాస్‌ బాయ్‌తో పరిశీలన చేయించాలి. బరువు, లీకేజీ, సీల్‌ సరిగా, ఉందా లేదా చూడాలి.

● సిలిండర్‌ను స్టౌవ్‌ను కలిపే ట్యూబ్‌ను నిశితంగా గమనించాలి. వేడివల్ల ట్యూబ్‌ సాగే గుణం కోల్పోయి పెలుసుబారి పగుళ్లు ఏర్పడతాయి.

● పైప్‌నకు గుండుసూది మొనంత రంధ్రం ఏర్పడినా గంటకు కిలోన్నర గ్యాస్‌ లీక్‌ అవుతుంది.సిలిండర్‌ ఖాళీ కాగానే మూత పెట్టాలి.లేకుంటే దుమ్ముదూళి లోపలకు చేరుతుంది.

ఈ జాగ్రత్తలు కూడా...

గ్యాస్‌ సిలిండర్‌ ఎప్పుడూ వెలుతురు ఉన్న ప్రదేశలో నిలువుగానే పెట్టాలి. మండే పదార్థాలకుదూరంగా ఉంచాలి. సిలిండర్‌ను పడుకోబెడితేలీక్‌ ఏర్పడే అవకాశముంటుంది. స్టౌను సిలిండర్‌ కంటే ఒక అడుగు ఎత్తులో ఉంచాలి. అలాకాకుండా స్టౌనునేలపై ఉంచి వంట చేయడం ప్రమాదకరం.ఏమాత్రం గ్యాస్‌ వాసన వచ్చినా తలుపులు, కిటికీలు తెరిచి రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలి.

అవగాహన అవసరం

గ్యాస్‌ వినియోగంపై అవగాహన కలిగి ఉండడమే కాక జాగ్రత్తలు పాటించాలి. వంట పూర్తికాగానే రెగ్యులేటర్‌ బంద్‌ చేయాలి. ఊరు వెళ్లే సమయాన రెగ్యులేటర్‌ తొలగించి సిలిండర్‌కు మూత తొడగాలి. గ్యాస్‌ లీక్‌ అవుతున్నట్లు గుర్తిస్తే లైట్లు వేయొదు. అగ్గిపెట్టె వెలిగించవద్దు. ఒకవేళ మంటలు అంటుకుంటే తడి గోనె సంచి లేదా తడి కాటన్‌ దుప్పటి సిలిండర్‌పై వేయాలి.

– వై.వెంకటేశ్వరరావు,

ఫైర్‌ ఆఫీసర్‌, సత్తుపల్లి

మృత్యువుతో పోరాడినా దక్కని ఫలితం

తల్లాడ: గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ అయిన ఘటనలో గాయపడిన బాలిక సోమవా రం మృతి చెందింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్‌ ఇంట్లో గతనెల 28న సిలిండర్‌ మారుస్తుండగా మంటలు చెలరేగిన విషయం విదితమే. ప్రమాదంలో వినోద్‌తో పాటు ఆయన కవల కుమారులు తరుణ్‌, వరుణ్‌, నాయనమ్మ సుశీల, ఆయన చెల్లెలి కుమార్తెలు గుంటు ప్రిన్సీ, లింసీ గాయపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో తరుణ్‌, వరుణ్‌, సుశీల మృతి చెందగా.. ప్రిన్సీ, లింసీ హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ప్రిన్సీ(9) వారం పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. సత్తుపల్లి మండలం రామానగర్‌కు చెందిన ఆమె పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో మేనమామ వినోద్‌ ఇంటికి వచ్చింది. ప్రమాదంలో నలుగురి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొనగా, ప్రిన్సీ సోదరి లింసీ హైదరాబాద్‌, వినోద్‌ ఇంటి వద్దే చికిత్స పొందుతున్నాడు. కాగా, బాలిక మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలిస్తామని తల్లాడ ఎస్‌ఐ బి.కొండల్‌రావు తెలిపారు.

అప్రమత్తంగా లేకపోతే ముప్పే1
1/2

అప్రమత్తంగా లేకపోతే ముప్పే

అప్రమత్తంగా లేకపోతే ముప్పే2
2/2

అప్రమత్తంగా లేకపోతే ముప్పే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement