
చేతికొస్తున్న ధాన్యం
అన్ని కేంద్రాలను ప్రారంభించాం
కామారెడ్డి క్రైం: జిల్లాలో వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలుకాగా అధికారులు ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం ధాన్యం సేకరణ ప్రారంభ దశలో ఉండగా.. ఈ సారి 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి కేంద్రాలకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రైతులను వరుణుడు ఆందోళనకు గురి చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంచనా కన్నా తక్కువ ధాన్యం కేంద్రాలకు వచ్చేలా కనిపిస్తోంది. మరో వైపు కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
గత కొన్ని సీజన్లుగా ధాన్యం సేకరణలో నిజామాబాద్ తర్వాత కామారెడ్డి జిల్లా ఉంది. సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల క్రితమే జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటిలాగే గుర్తించిన అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. మొత్తం 427 కేంద్రాలను ప్రారంభించగా వాటిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 233, ఐకేపీ ఆధ్వర్యంలో 194 కేంద్రాలున్నాయి. గతేడాది ఖరీఫ్కు సంబంధించి 351 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముందుగా భావించారు. కానీ ఆయా ప్రాంతాల నుంచి రైతులు కోరడంతో మొత్తం 424 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో 3.14 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. 4.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రావొచ్చని అంచనా వేశారు. కానీ 4.31 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అప్పటికీ ధాన్యం సేకరణలో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ సారి జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 5.90 లక్షల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. రైతుల ఇంటి అవసరాలు పోను మిగితాది కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రేడ్–ఏ ధాన్యం క్వింటాల్కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే రైతులు ముందుగా ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం 17కి మించకుండా కేంద్రాలకు తీసుకు రావాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రస్తుత సీజన్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం ఆరబెట్టే అవకాశం దొరకడం లేదు. వర్షాలు కురిసి ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో రైతులు తక్కువ ధరకై నా సరే కల్లాల్లో నుంచే కొనుగోలు చేసే దళారుల వైపు మొగ్గుచూపిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణుడు దయ చూపిస్తేనే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగనుంది. ప్రతిసారి బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, నిజాంసాగర్ మండలాల పరిధిలో ముందుగా ధాన్యం సేకరణ ప్రారంభమవుతుంది. అధికారులు మాత్రం కేంద్రాలన్నీ ప్రారంభించి సిద్ధంగా ఉన్నారు. యంత్ర పరికరాలు, గన్నీ సంచుల తరలింపు, రవాణా, తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్నారు. వానలు బ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ఏ మేరకు ధాన్యం సేకరణ జరుతుందో చూడాలి మరి.
జిల్లాలో 427 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నింటినీ వారం రోజుల క్రితమే ప్రారంభించాం. ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా కొనుగోళ్ల ప్రక్రియ జరిగేలా రకాల చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలి.
– శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్
జిల్లాలో 427 ధాన్యం కొనుగోలు
కేంద్రాల ఏర్పాటు
4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
ఇప్పటికే పలు చోట్ల
ప్రారంభమైన సేకరణ
ఆందోళన కలిగిస్తున్న వర్షాలు