
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
● వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
● వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం
గద్వాలటౌన్: ఆది పరాశక్తి... అశ్రిత పక్షపాతి అమ్మవారిని కొలిచేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలను పట్టణంలోని పలు ఆలయాలలో అత్యంత వైభంగా చేపట్టారు. మూలప్రతిమలు, ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు, అభిషేకాలు చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. నీ చల్లని చూపులు మాపై ఉండాలంటూ భక్తులు ప్రణమిల్లారు. సాయంత్రం పలు చోట్ల భక్తిగీతాలపన, నృత్య ప్రదర్శనలు, కచేరీలు, అధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణ.. గద్వాల ఇలవేల్పు జములమ్మ ఆలయంలో అమ్మవారు గజలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే, స్థానిక తాయమ్మ ఆలయంలో, కుమ్మరివీధిలో, అంబాభవాని దేవాలయంలో, వీరభద్రస్వామి ఆలయంలో, మార్కెండేయస్వామి ఆలయంలో అమ్మవారు వివిధ రూపాల అలంకరణలో దర్శనమిచ్చారు. బాలాజీవీధులలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేపట్టారు. స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఊరేగించారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి.
విశేష పూజలు అందుకుంటున్న దుర్గామాత
జములమ్మ ఆలయంలో గజలక్ష్మిదేవి అలంకరణలో అమ్మవారు

ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ